
భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతున్నది. రోహిణి కార్తె ఎంటరయ్యాక తొలిసారిగా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో మూడోసారి 47 డిగ్రీల మార్క్టచ్ అయ్యాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా ఐదు నుంచి 10 డిగ్రీల హై టెంపరేచర్స్ రికార్డయ్యాయి. ముఖ్యంగా 16 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
కోల్బెల్ట్ భగభగ
కోల్బెల్ట్ పరిధిలోని ప్రాంతాలు శుక్రవారం ఎండ వేడితో భగభగ మండాయి. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని మండలాల్లో జనాలు అల్లాడిపోయారు. జగిత్యాల మినహా (11 మండలాలు) మిగతా మూడు జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నస్పూర్(మంచిర్యాల) 46.9, పాత మంచిర్యాల 46.7, ముత్తారం (పెద్దపల్లి) 46.6, హాజీపూర్ (మంచిర్యాల)లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 46.9, నల్గొండ జిల్లా కేతేపల్లి, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.8, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల 46.4, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో 46.3, ములుగు జిల్లా వెంకటాపురంలో 46.2, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 45.9, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 45.7, సిద్దిపేట జిల్లా కట్కూర్, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 45.1 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.