అట్లదార్-పాద్ర హైవేపై ప్రమాదం..ఐదుగురు మృతి

అట్లదార్-పాద్ర హైవేపై ప్రమాదం..ఐదుగురు మృతి

గుజరాత్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వడోదరలోని నారాయణ్ వాడీ సమీపంలో అట్లదార్-పాద్ర హైవేపై ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. 

పాద్రాలోని లోలా గ్రామానికి చెందిన అరవింద్ నాయక్ కుటుంబం వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వడోదర అసిస్టెంట్ కమిషనర్ ప్రణవ్ కటారియా తెలిపారు. ఆరుగురు ప్రయాణిస్తున్న ఆటోను ఎర్టిగా కారు ఢీకొట్టగా... ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారని...మరో ఇద్దరు  ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. 8 ఏళ్ల ఆర్యన్  చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని..కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మృతులు అరవింద్ నాయక్, అతని భార్య కాజల్, కుమారుడు గణేష్, కుమార్తె దృష్టి, మేనకోడలు శివానిగా గుర్తించామన్నారు.