న్యూఢిల్లీ: దేశ ఐపీఓ మార్కెట్ ఫుల్ జోష్లో ఉంది. ఇరాన్ యుద్ధం తర్వాత వాయిదా వేసుకున్న చాలా కంపెనీలు ఇన్వెస్టర్లు ముందుకొచ్చేందుకు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. వచ్చే నెలలో క్విక్-కామర్స్ సంస్థ జెప్టో, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ట్రూహోమ్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ షిప్రాకెట్తో కలిపి డజనుకు పైగా కంపెనీలు తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను ప్రారంభించనున్నాయి. ఈ కంపెనీలు మొత్తంగా రూ. 25 వేల కోట్లు సేకరించనున్నాయని అంచనా. ఇందులో కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఉన్నాయి.
రేసులో ఉన్న ప్రధాన కంపెనీలు
జెప్టో: వచ్చే నెలలో రాబోయే అతిపెద్ద ఐపీఓల్లో ఇదొకటి. ఈ క్విక్కామర్స్ కంపెనీ కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 8,010 కోట్ల వరకు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. అలానే పేరెంట్ కంపెనీ ఓఎఫ్ఎస్ కింద 11.34 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.
ట్రూహోమ్ ఫైనాన్స్ : ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ రూ. 3 వేల కోట్ల ఐపీఓకి సిద్ధమవుతోంది. ఇందులో రూ. 1,500 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రూ. 1,500 కోట్ల ఓఎఫ్ఎస్ ఉన్నాయి.
ఎలివేట్ క్యాంపసెస్: ఈ సంస్థ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 2,550 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఎలివేట్ క్యాంపసెస్ ఇండియాలోని టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో ఆన్–క్యాంపస్ అకామిడేషన్ సర్వీస్లను అందిస్తోంది.
షిప్రాకెట్: ఈ-–కామర్స్ లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ షిప్రాకెట్ రూ. 2,342.35 కోట్ల ఐపీఓ కోసం సెబీకి పేపర్లు సమర్పించింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 1,100 కోట్లు, ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 1,242.35 కోట్లు సేకరించనుంది.
ఇన్నోవేటివ్వ్యూ ఇండియా, మిల్కీ మిస్ట్: ఎగ్జామ్స్, ఎలక్షన్స్, పెద్ద ఈవెంట్లకు సర్వైలెన్స్ సర్వీస్లు అందించే ఇన్నోవేటివ్వ్యూ ఇండియా ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 2 వేల కోట్లు సేకరించాలని చూస్తోంది. మరోవైపు డెయిరీ బ్రాండ్ మిల్కీ మిస్ట్ కూడా ఆగస్టులో తమ రూ. 1,553 కోట్ల ఐపీఓని తీసుకురానుంది.
వీటితో పాటు ధూత్ ట్రాన్స్మిషన్, ఆర్సిల్ (ఏఆర్సీఐఎల్), ఆర్డీ ఇండస్ట్రీస్, గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్, రేస్ ఆఫ్ బిలీఫ్, హై-టెక్ ఇంజనీర్స్, శంకేష్ జ్యువెలర్స్, లెర్న్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్ వంటి కంపెనీలు కూడా తమ ఐపీఓలను తీసుకురావడానికి
సిద్ధమవుతున్నాయి.
ఈ వారంలో
ఈ వారం మూడు మెయిన్ బోర్డ్ ఐపీఓలు ఓపెన్ అవుతాయి. దాదాపు రూ. 11,300 కోట్లను సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నాయి.
మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్
మణిపాల్ హాస్పిటల్స్ పేరెంట్ కంపెనీ మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఐపీఓ ఈ నెల 29న ఓపెనై, 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఒక్కో షేరుని రూ. 560 – రూ. 590 రేంజ్లో అమ్మనున్నారు. కంపెనీ రూ. 9,275 కోట్లను సేకరించాలని చూస్తోంది. ఇందులో రూ. 8 వేల కోట్ల విలువైన ఫ్రెష్ షేర్ల ఇష్యూ, రూ. 1,275.22 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉన్నాయి. ఈ ఐపీఓకి కోటక్ మహీంద్రా క్యాపిటల్ లీడ్ మేనేజర్గా వ్యవహరిస్తోంది.
జూనిపర్ గ్రీన్ ఎనర్జీ
రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.1,800 కోట్లు సేకరించనుంది. జులై 30 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పబ్లిక్ ఇష్యూ ఓపెన్లో ఉంటుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లీడ్ మేనేజర్గా పనిచేస్తోంది.
ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్
ఎలక్ట్రికల్, పవర్ ఇన్ఫ్రా కంపెనీ ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ ఐపీఓ జులై 30 న ప్రారంభమై, ఆగస్టు 3 న ముగుస్తుంది. మొత్తం రూ. 290 కోట్లను ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా సేకరించనున్నారు.
