సంస్థ కార్యకలాపాలకు, సంస్థ ఆదాయానికి పొంతన లేదు: ఐటీ శాఖ
పలు ఆధారాలు సేకరించినట్లు వెల్లడించిన అధికారులు
దర్యాప్తును ఆలస్యం చేసే ప్రయత్నాలు చేశారని ఆరోపణ
న్యూఢిల్లీ : బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) అకౌంటింగ్ పుస్తకాల్లో అక్రమాలు గుర్తించినట్లు ఇంకమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. బీబీసీలోని వివిధ విభాగాలు వెల్లడించిన ఆదాయం, లాభాలు.. దేశంలో జరుగుతున్న సంస్థ కార్యకలాపాల స్థాయికి అనుగుణంగాలేవని చెప్పింది. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించినట్లు వివరించింది. ఉద్యోగుల స్టేట్మెంట్లు, డిజిటల్ ఫైల్స్, డాక్యుమెంట్లను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పింది. ‘‘బీబీసీలోని విదేశీ సంస్థలు పంపిన డబ్బుపై పన్ను చెల్లించలేదు. వాటిని ఇండియాలో ఆదాయంగా చూపించలేదు’’ అని వివరించింది. బీబీసీ సిబ్బంది.. దర్యాప్తును ఆలస్యంచేసే ప్రయత్నాలు చేశారని ఆరోపించింది. ఆ సంస్థ ఇలాంటి వైఖరి చూపినప్పటికీ.. మీడియా/చానల్ కార్యకలాపాలను నిరంతరం కొనసాగించుకునేలా చూస్తూనే సర్వే జరిపినట్లు తెలిపింది. మరోవైపు మూడు రోజులపాటు ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సర్వే చేశారు.
ప్రకటనలోని ముఖ్యాంశాలు
* వివిధ భారతీయ భాషల్లో కంటెంట్ వినియోగం ఎక్కువే.. అయితే వివిధ గ్రూప్ సంస్థలు చూపే ఆదాయం దేశంలోని కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవు.
* ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో తేడాలు ఉన్నాయి.
* ఉద్యోగుల స్టేట్మెంట్, డిజిటల్ ఆధారాలు, డాక్యుమెంట్ల ద్వారా కీలకమైన సాక్ష్యాలు దొరికాయి. వాటిని పరిశీలించాల్సి ఉంది.
* కేవలం కీలక సిబ్బంది స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కోరిన పత్రాలు/అగ్రిమెంట్లను అందించే క్రమంలో డైలేటరీ వ్యూహాలు (దర్యాప్తును ఆలస్యం చేసే ప్రయత్నాలు) ఉపయోగించినట్లు గమనించాం.
ఇందిర హయాంలోనూ..
ఇందిరా గాంధీ హయాంలో బీబీసీని రెండు సార్లు బ్యాన్ చేశారు. 1970ల్లో కలకత్తా, ఫాంటమ్ ఇండియా పేరుతో ఫ్రెంచ్ డైరెక్టర్ లూయిస్ మల్లే తీసిన డాక్యుమెంటరీలు వివాదాస్పదమయ్యాయి. వీటిని బీబీసీ ప్రసారం చేసింది. దీంతో దేశంలో కార్యకలాపాలు నిలిపేయాలని బీబీసీకి కేంద్రం నోటీసులిచ్చింది. ఆ సంస్థ నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోవడంతో 1970 ఆగస్టు 29న బీబీసీ కార్యకలాపాలు నిలిపేసేలా ఆదేశాలిచ్చింది. భారతదేశంలో బీబీసీ ఎప్పటికీ రిపోర్ట్ చేయకుండా నిషేధించాలని 1975లో అనేకమంది కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దేశ వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోందని వారు ఆరోపించారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో బీబీసీని బహిష్కరించారు.
