ఇండియన్​ రిమోట్​ సెన్సింగ్​ వ్యవస్థ ప్రయోగం

ఇండియన్​ రిమోట్​ సెన్సింగ్​ వ్యవస్థ ప్రయోగం

ఇండియన్​ రిమోట్​ సెన్సింగ్​ వ్యవస్థ(ఐఆర్​ఎస్​)ను భారత్​ మొదటిసారిగా 1988లో ఐఆర్​ఎస్​–1ఏ ప్రయోగంతో ప్రారంభించింది. ఒక వస్తువు నుంచి వచ్చే వికిరణం ఆధారంగా ఆ వస్తువు లక్షణాలను, దూరాన్ని సుదూరం నుంచి తెలుసుకోవడాన్ని రిమోట్​ సెన్సింగ్​ అంటారు. రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం రిజల్యూషన్​ శక్తి. రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచే స్పష్టంగా చూడగలగటాన్ని రిజల్యూషన్​ శక్తి అంటారు.

ఈ విధమైన అనేక రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల సముదాయాన్ని ఇండియన్​ రిమోట్​ సెన్సింగ్​ వ్యవస్థ అంటారు. ఈ ఉపగ్రహాల్లోని వివిధ సెన్సర్స్​ కావాల్సిన సమాచారాన్ని సేకరించి, దాని విశ్లేషణ కోసం హైదరాబాద్​లోని  ఎన్​ఆర్​ఎస్సీకి పంపిస్తాయి. ఈ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు, అంతిమ వినియోగదారులకు చేర్చేందుకు ఐదు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు, డెహ్రాడూన్​, జోధ్​పూర్​, కోల్​కత్తా, నాగ్​పూర్​ల్లో ఉండే ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఎన్​ఆర్​ఎస్సీ రిమోట్​ సెన్సింగ్​ సమాచారాన్ని దేశమంతటా ప్రసారం చేస్తుంది.

రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని జాతీయ స్థాయిలో నేషనల్​ నేచురల్​ రిసోర్స్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ నిర్వహిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాతావరణ సమాచార సేకరణ, విపత్తు నిర్వహణ, రవాణా వ్యవస్థ మెరుగుదలకు, జాతీయ భద్రతకు రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాలు ఉపకరిస్తాయి.