- ఈ నెల 11న బంద్ కు పిలుపునిచ్చిన కార్మికుల జేఏసీ
బషీర్ బాగ్, వెలుగు: రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 10న అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు అన్ని రకాల ట్రాన్స్పోర్టు వాహనాల బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ తెలిపింది. హైదర్ గూడా ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ కన్వీనర్ దయానంద్, కో కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
సిటీలో ఆటోలకు కొత్త పర్మిట్లను మంజూరు చేయాలని, లారీలకు సింగిల్ పర్మిట్ విధానం తీసుకురావాలని, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే లక్షలాది మంది రవాణా రంగ కార్మికులతో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.