- మోదీ ఆఫర్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరణ
- రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఎన్డీయేలో భాగమైన జనసేన పార్టీ.. ప్రధానంగా ఏపీ పాలిటిక్స్ పైనే ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తున్నది. అందుకే కేంద్ర కేబినెట్ లో చేరలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కూటమిలో భాగంగా కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించింది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి గెలిచారు. గతంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన.. ఎన్నికలకు కొద్ది నెలల ముందే జనసేనలో చేరి విజయం సాధించారు. ఇక కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలిచారు. ఈయన పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ తొలిసారి ఎంపీ కాగా, బాలశౌరి మూడోసారి ఎంపీగా గెలిచారు. వీరిలో ఒకరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ కేంద్ర కేబినెట్ లో జనసేన చేరలేదు.
పవన్ కు మోదీ ఆఫర్..
కేంద్ర కేబినెట్ లో చేరాలని జనసేన చీఫ్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ కోరినట్టు తెలుస్తున్నది. ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చి, ఏదో ఒక రాష్ర్టం నుంచి రాజ్యసభకు పంపించాలని ప్రధాని భావించారు. కానీ ఈ ఆఫర్ ను పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఏర్పాటైన పదేండ్ల తర్వాత పవన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వెంటనే కేంద్రంలో చేరితో జనసేన నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, అందుకే రాష్ట్రంలో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ గ్రామ, మండల, జిల్లా, రాష్ర్ట కమిటీలు నియమించి.. రానున్న రోజుల్లో రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ, అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికే పవన్ కేంద్ర కేబినెట్ లో చేరలేదని సమాచారం. కాగా, 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను జనసేన గెలుచుకుంది. పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించింది. కూటమి అభ్యర్థుల గెలుపులోనూ జనసేన చీఫ్ పవన్ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర కేబినెట్ లో డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ లేదా మరేదైనా కీలక శాఖ ఇవ్వాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
