కేసీఆర్​కు షాక్!.. కర్నాటక ఫలితాలతో బీఆర్​ఎస్​ డీలా

కేసీఆర్​కు షాక్!.. కర్నాటక ఫలితాలతో బీఆర్​ఎస్​ డీలా

కర్నాటక ఫలితాలతో బీఆర్​ఎస్​ డీలా

జేడీఎస్​ను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పాలనుకున్న గులాబీ బాస్

కింగ్​ మేకర్​గా కుమారస్వామి మారుతారని ఎన్నో ఆశలు

రిజల్ట్స్​కు ముందే హైదరాబాద్​ స్టార్​ హోటళ్లలో రూముల బుకింగ్

తీరా కాంగ్రెస్​కు ఏకపక్ష విజయం దక్కడంతో హైరానా

37 నుంచి 19 సీట్లకు పడిపోయిన కుమారస్వామి పార్టీ 

హైదరాబాద్, వెలుగు : కర్నాటక ఎన్నికల ఫలితాలు కేసీఆర్​కు షాక్​ ఇచ్చాయి. కుమారస్వామి పార్టీ జేడీఎస్​ను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పాలని భావించిన ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాదని, హంగ్​వస్తే కింగ్​మేకర్​గా కుమారస్వామి అవుతారని కేసీఆర్​ ముందు నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశారు. రిజల్ట్స్​కు ముందే హైదరాబాద్​లోని స్టార్ హోటళ్లలో జేడీఎస్ ఎమ్మెల్యేలతో క్యాంపు పెట్టి బేరసారాలు చేయాలని చూశారు. తీరా కర్నాటక ప్రజలు కాంగ్రెస్​కు ఏకపక్ష విజయం కట్టబెట్టడంతో బీఆర్​ఎస్​ డీలా పడింది. కన్నడ ఫలితాల ప్రభావం తెలంగాణపైనా పడుతుందని హైరానా చెందుతున్నది. శనివారం మధ్యాహ్నం వరకే ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చినా సాయంత్రం వరకు బీఆర్ఎస్​ నుంచి ఎలాంటి స్పందన లేదు. 

ఎన్నో ప్రయత్నాలు చేసి..!

టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా మార్చినప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని కేసీఆర్​ ప్రకటించారు. జేడీఎస్​ చీఫ్​ కుమారస్వామిని సీఎం చేయడమే తమ లక్ష్యమని కూడా చెప్పారు. తీరా ఎన్నికల షెడ్యూల్​వచ్చాక వ్యూహత్మకంగానే ఆయన దూరంగా ఉన్నారు. తెరచాటున జేడీఎస్​కు అండగా నిలుస్తూ వచ్చినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రభావం కళ్యాణి కర్నాటకపై ఎక్కువగా ఉందని, అక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లలో జేడీఎస్​ను గెలిపించాలని కేసీఆర్​ఎత్తులు వేస్తూ వచ్చారు. మొదట ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పోటీ చేయాలని అనుకున్నా.. అది ఇతర పార్టీలు గెలిచేందుకు దోహదం చేస్తుందని ఆ ప్రయత్నాలను కేసీఆర్​ మానుకున్నారు.

టీఆర్ఎస్​పేరును బీఆర్ఎస్​గా మార్చే క్రమంలో ప్రతి అడుగులో తన వెంటే ఉన్న కుమారస్వామిని కర్నాటక ఎన్నికల్లో గట్టెక్కించాలని కేసీఆర్​ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పలు సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్​పోల్స్​కూడా కేసీఆర్​అంచనాలకు దగ్గరగా ఉండటంతో కుమారస్వామి కింగ్​మేకర్​ అవుతారని బీఆర్​ఎస్​ శ్రేణులు భావించాయి. శనివారం కర్నాటక ఎన్నికల రిజల్ట్స్​ఉండటంతో శుక్రవారమే నగరంలోని తాజ్​కృష్ణాలో 18, పార్క్​హయత్​లో 20, నోవాటెల్​లో 20 సూట్లు బుక్​చేశారు. ఈ రూముల్లో జేడీఎస్​ఎమ్మెల్యేలను పెట్టి చక్రం తిప్పాలని చూశారు. కానీ, కేసీఆర్ ఒకటి తలిస్తే కర్నాటక ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. 

సొంత నేతలు చేజారకుండా..!

ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్​పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్​ పార్టీ టార్గెట్​గా 2014 నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, నేతలను బీఆర్ఎస్​ చేర్చుకుంటూ వస్తున్నది. ఫలితంగా గులాబీ పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రం కర్నాటకలో కాంగ్రెస్​ విజయం సాధించడంతో బీఆర్ఎస్​లో టికెట్​రాదనే నిర్ణయానికి వచ్చిన నేతలంతా కాంగ్రెస్​ వైపు చూసే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. కన్నడ ఓటర్లు ఇచ్చిన బూస్టింగ్​తో కాంగ్రెస్​ నేతలు గులాబీ పార్టీ నేతలకు ఆకర్ష్​వల విసిరితే ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో కేసీఆర్​ ఉన్నట్లు తెలుస్తున్నది.

ఈ ఏడాది నవంబర్​నెలాఖరులోపే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇక్కడా ఎంతో కొంత పడుతుందని ప్రగతి భవన్​క్యాంపు లెక్కలు వేసుకుంటున్నది. ఎక్కడెక్కడ కాంగ్రెస్​కు లబ్ధి చేకూరొచ్చు.. ఎక్కడెక్కడ తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చు.. అని బీఆర్​ఎస్​ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. కర్నాటకలో తమ అంచనాలు బెడిసికొట్టడంతో కొన్నాళ్లపాటు  సైలెంట్​గా ఉండటమే బెటర్​అనే భావనలో గులాబీ బాస్​ఉన్నట్టు తెలుస్తున్నది. 

కింగ్​ మేకర్​ కాదు కదా.. ఉన్న సీట్లలో 18 పోయినయ్​

జేడీఎస్​సొంతగా పోటీ చేసి 2018లో 37 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్​మీటింగుల్లో కేసీఆర్​ వెంటే కుమారస్వామి వరుసగా కనిపించడంతో జేడీఎస్​పార్టీ బీఆర్ఎస్​కు బీ టీం అనే ప్రచారం సాగింది. మైసూర్​ ప్రాంతంలో కాంగ్రెస్​ నేతలు పెద్ద ఎత్తున ఇదే లైన్​ను జనంలోకి తీసుకెళ్లారు.  కేసీఆర్​వెనుకుండి కుమారస్వామిని నడిపిస్తున్నారని వారు జనానికి చెప్తూ వచ్చారు. ఈ ప్రభావం మైసూర్​ప్రాంత ఓటర్లపై ఎక్కువగా పడటంతో జేడీఎస్​తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణలోని తమ పథకాల ప్రభావంతో కళ్యాణి కర్నాటకలో జేడీఎస్​ ఎక్కువ సీట్లు గెలువొచ్చన్న కేసీఆర్​అంచనాలు తలకిందులయ్యాయి.

మొత్తంగా గత ఎన్నికలతో పోలిస్తే  18 సీట్లను చేజార్చుకొని 19 సీట్లకే జేడీఎస్​పరిమితిమైంది. ‘‘కర్నాటక ఎమ్మెల్యే సీట్లు మీకు.. ఎంపీ సీట్లు మాకు’’ అన్న అవగాహనతో  కుమారస్వామితో ముందుకుసాగిన  గులాబీ బాస్​ ఆశలకు కర్నాటక ప్రజలు ఆదిలోనే గండి కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో  జేడీఎస్​బోల్తా పడటంతో ఇక అక్కడ లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, జేడీఎస్​ప్రభావం ఎంతమేరకు ఉంటుందని, కేసీఆర్​ జాతీయ రాజకీయాల ప్రస్థానం ఏ రకంగా  సాగుతుందోనన్న చర్చ కూడా మొదలైంది.