ఇటీవలి కాలంలో తెలంగాణ నలుమూలలా అనేక గ్రామాలు, పట్టణాలు కోతుల జనాభాలో నాటకీయ పెరుగుదలను చూస్తున్నాం. కోతి అంటే దైవత్వం, సంస్కృతికి చిహ్నం. అయితే ఈ దశ ఇప్పుడు నిరాశ, ఆర్థిక నష్టానికి ప్రధాన కారణంగా మారింది రైతులకు. పెరుగుతున్న కోతుల జనాభా వాణిజ్య పంటలకు, ముఖ్యంగా మామిడి తోటలు, కూరగాయలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పంట నష్టంతోపాటు, కోతులను అడ్డుకుంటున్నవారిపై దాడి చేసి గాయపరచడంప్రారంభించాయి. కోతుల బెడద ఒక విసుగుగా ప్రారంభమై ఇప్పుడు తీవ్రమైన గ్రామీణ సంక్షోభంగా మారింది.
కోతుల వల్ల రైతులే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. కోతులు దళాలుగా పంట పొలాలపై దాడి చేసి నిమిషాల్లోనే పంటలను నాశనం చేస్తాయి. మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, మొక్కజొన్న పంటలు, కూరగాయలు కూడా పంటకోతకు ముందే నాశనమవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, శ్రమ కోర్చి వేల రూపాయలు పెట్టుబడి పెట్టే రైతు, కోతుల బెడద కారణంగా నిమిషాల్లో పంటను కోల్పోతాడు. కొన్ని గ్రామాల్లో ప్రజలు తమ పొలాలను కాపాడుకోవడానికి వాచ్మెన్లను నియమించుకోవలసి వస్తుంది లేదా రాత్రిపూట మేల్కొని ఉండవలసి వస్తుంది. ఈ ప్రక్రియతో రైతు శాంతి, జీవనోపాధి రెండింటినీ కోల్పోతున్నాడు. ఈ సమస్య కేవలం వ్యవసాయానికే పరిమితం కాదు. కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. తమను తాము రక్షించుకోలేని వృద్ధులపై కూడా దాడి చేస్తాయి. అనేక
గ్రామాల్లో, ప్రజలు ఇప్పుడు చేతిలో కర్రలతో నడుస్తున్నారు. అది ఫ్యాషన్ కోసం కాదు, తమ రక్షణ కోసం!
విద్యుత్ లైన్లతో ప్రమాదాలు
కోతులు ప్రధానంగా ఇళ్ల గోడలపై నుండి ఆనుకొని ఉన్న స్తంభాలపైకి ఎగిరే ప్రయత్నంలో హెచ్.టి, ఎల్.టి లైన్లకు తగిలి చేతులు, కాళ్ళు పోగొట్టుకుంటున్నాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయాలకు కారణం అవుతున్నాయి. కొన్ని సమయాల్లో వైర్లకు వేలాడి ప్రాణం కోల్పోతే విద్యుత్ సిబ్బందిని దరికి రానీయడం లేదు. జీవశాస్త్రం ప్రకారం అసలు కోతుల పరిణామక్రమం తెలుసుకుందాం. జీవశాస్త్ర నిపుణులు చెపుతున్న ప్రకారం, కోతుల ఆయుర్దాయం సుమారు 15-–20 ఏండ్లు. కోతి గర్భధారణ సమయం నుంచి 164-–170 రోజుల వ్యవధిలో పిల్లను కంటుంది. ప్రతి కాన్పుకు ఒకే పిల్ల పుడుతుంది. కవలల పుట్టిన సందర్భాలు లేవంటారు. అంటే రెండేళ్ల వ్యవధిలో మూడుసార్లు పిల్లల్ని కంటుంది. పిల్లకోతి మూడేళ్లలో యుక్త వయసుకు వస్తుంది.
అభయారణ్యాలకు తరలించాలి
కోతులను ఎప్పటికప్పుడు అటవీ మండలాలు లేదా అభయారణ్యాలకు తరలించాలి. అటవీ ప్రాంతాలకు తరలించడం ద్వారా గ్రామాల్లో వాటి ఉనికిని తగ్గించవచ్చు. చాలామంది రైతులు మోషన్- డిటెక్టింగ్ అలారాలు, ప్రతిబింబించే రిబ్బన్లు, తక్కువ- వోల్టేజ్ ఫెన్సింగ్ వంటి శాస్త్రీయ సాధనాలను అవలంబిస్తున్నారు. ప్రభుత్వం దీనిని వ్యవసాయ, ప్రజా భద్రతా సమస్యగా పరిగణించాలి. కోతుల పునరావాసం కోసం నిధులు కేటాయించడం, శిక్షణ పొందిన అటవీ సిబ్బందిని నియమించడం, పంట నష్టానికి రైతులకు పరిహారం అందించడం వంటి తక్షణ చర్యలు తీసుకోవాలి. పంచాయతీలు అటవీశాఖతో సహకరించాలి. అదే సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కోతులపై ఆహారాన్ని విసరడంలాంటి చర్యలు గందరగోళానికి దారితీస్తుందని ప్రజలు అర్థం చేసుకోవాలి. గ్రామస్తులు శాస్త్రీయ మార్గదర్శకాలను పాటించాలి. ఇళ్ల దగ్గర కోతులను అడ్డుకోవడానికి ఇనుప జాలీలు అమర్చుకోవాలి. వన్యప్రాణి చట్టాలను వందశాతం పాటించాలి. కోతుల బెడద కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, ఇది తక్షణం దృష్టి పెట్టవలసిన ఆర్థిక, సామాజిక, భద్రతా సమస్య.
ప్రకృతితో సహజీవనం ముఖ్యం. ప్రభుత్వ విధానం, శాస్త్రీయ చర్యలు, ప్రజా సహకారాన్ని మిళితం చేయడం ద్వారా సమతుల్యతను పునరుద్ధరించాలి. ప్రజలను, రైతుల పంటలను రక్షించాలి. కోతులకు పునరావాసం, ఆహార భధ్రత కల్పించి బాధ్యతాయుతంగా నిర్వహించినప్పుడు మాత్రమే రైతులు కోతుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మూగజీవాల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు రైతులకు వాటినుంచి ఎటువంటి సమస్యలు ఎదురవ్వకుండా ప్రభుత్వం తగిన చర్యలు ప్రణాళికాబద్ధంగా తీసుకోవాలి.
ఆహారం కోసం..జనావాసాల్లోకి వానరాలు
కోతులు జనావాసాల్లోకి రావడానికి మూల కారణం ప్రకృతి, మానవ కార్యకలాపాల మధ్య అసమతుల్యత. అటవీ నిర్మూలన. పట్టణీకరణ వాటి సహజ
ఆవాసాలను నాశనం చేశాయి. ఆహారం కోసం అవి మానవ నివాసాలలోకి వెళ్లవలసి వస్తున్నది. అదనంగా ప్రజలు మత విశ్వాసాల కారణంగా కోతులకు
ఆహారం ఇస్తున్నారు, తెలియకుండానే ఆహారం కోసం మానవులపై ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తున్నారు. సహజంగా అడవుల్లో ఉండేవి మానవుల మీద ఆధారపడి నేటి గందరగోళానికి కారణం అవుతున్నాయి. కోతుల అనియంత్రిత పెరుగుదలను అరికట్టడానికి, శాస్త్రీయ, మానవీయ విధానం అవసరం. క్రమం తప్పకుండా స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టి జనన నియంత్రణ ఆపరేషన్ల ద్వారా వీధి కుక్కల జనాభాను నియంత్రించినట్లే, అధిక సాంద్రత ఉన్న ప్రాంతాలలో కోతుల కోసం ఇలాంటి స్టెరిలైజేషన్ డ్రైవ్లను నిర్వహించాలి. ఇందుకు స్థానిక సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు, వెటర్నరీ వైద్యులను అందుబాటులో ఉంచాలి.
- దురిశెట్టి మనోహర్,
రిటైర్డ్ ఏడీఈ
