- 38 సంఘాలకు రూ. 7.99 కోట్లు
- చెల్లింపులు లేకపోవడంతో బ్యాంక్ నోటీసులు
- లోన్లు తీసుకోలేదంటూ గగ్గోలు పెట్టిన సభ్యులు
- ఆర్పీ లపై కేసు.. కెనెరా బ్యాంకు నుంచి డేటా సేకరణ
- విచారణ జరుగుతున్న సమయంలోనే రూ.1.61 కోట్లు చెల్లింపులు
- ఫేక్ సంఘాల వద్దే ఇంకా రూ. 6.38 కోట్లు
- కెనరా బ్యాంకు ఆర్ఎం కు నివేదిక
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో సభ్యులే లేని ఫేక్ మహిళా సంఘాలకు ఇచ్చిన లోన్ల లెక్క తేలింది.ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఆఫీసర్లు కెనరా బ్యాంక్ ఆర్ఎంకు నివేదిక ఇచ్చారు. మెప్మా హయ్యర్ ఆఫీసర్లకు కూడా నివేదిక పంపించారు. ఫేక్ సంఘాలను సృష్టించి లోన్లు తీసుకున్న ఆర్పీలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది.
సభ్యులే లేని సంఘాల సృష్టి..
సుదీర్ఘకాలంగా మెప్మాలో పని చేస్తున్న ఆర్పీలు లోన్లు తీసుకోవడానికి కొత్త ప్లాన్ చేశారు. సభ్యులే లేని మహిళా సంఘాలను సృష్టించారు. ఒక్కొక్కరి పేర్లు రెండుమార్లు రాయడంతో పాటు ఆధార్ కార్డులు కూడా రెండు చొప్పున జత చేశారు. ఇలా పలు సంఘాలను సృష్టించి కెనరా బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేశారు. 2022 నుంచి 2025 వరకు ఒక్కో సంఘం పేరుతో రూ. 20 లక్షలు అంతకుపైగా లోన్లు తీసుకున్నారు. ఈ విధంగా 38 సంఘాల పేర్లతో ఆర్పీలు రూ. 7.99 కోట్లు లోన్లు తీసుకున్నారు. ఈ లోన్లు తీసుకోవడానికి 2022–-25 మధ్య కాలంలో పని చేసిన ఫీల్డ్ ఆఫీసర్లు ఆర్పీలకు సహకరించారు.
బయటపడింది ఇలా..
ఈ ఏడాది ఫైనాన్స్ ఇయర్ ముగింపు సమయానికి మహిళా సంఘాలు తీసుకున్న లోన్లపై బ్యాంకర్లు దృష్టి పెట్టారు. పేమెంట్ చేయని వారి లిస్ట్లను రూపొందించిన భువనగిరిలోని కెనరా బ్యాంకు లోన్లు తీసుకున్న సభ్యులకు నోటీసులు పంపించారు. దీంతో అసలు తాము ఆ సంఘంలో లేమని, లోన్లే తీసుకోలేదంటూ పలువురు బ్యాంకుకు వెళ్లి వివరించారు. అనంతరం ఆయా సంఘాలకు లోన్లు ఇప్పించడం కీలకంగా వ్యవహరించిన ఆర్పీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్పీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి కేసులు నమోదు చేశారు. తామెలాంటి తప్పు చేయలేదని ఆర్పీలు వాదించారు.
నలుగురు ఆర్పీలు.. రూ. 7.99 కోట్లు
ఈ అక్రమ లోన్ల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న మెప్మా ఆఫీసర్లు భువనగిరి కెనరా బ్యాంకులోని మహిళా సంఘాలకు సంబంధించిన అకౌంట్ల డేటా తెప్పించారు. అన్ని అకౌంట్ల ఆడిట్ నిర్వహంచారు. సంఘాలకు ఏవిధంగా లోన్లు మంజూరు చేశారో పరిశీలించారు. రూల్స్ ప్రకారం మైక్రో క్రెడిట్ ప్లాన్ ఆధారంగా లోన్లు ఇవ్వాల్సి ఉండగా, అలాంటిదేమీ లేకుండానే 2022 నుంచి 2025 వరకూ పని చేసిన పలువురు భువనగిరి మున్సిపల్ కమిషనర్ల సిఫారసుతో ఇచ్చినట్టు తేలింది. భువనగిరి చెందిన ఆర్పీ బిందు 13 సంఘాల పేరుతో రూ. 2 కోట్లకు పైగా, మరో ఆర్పీ దివ్య 21 సంఘాల పేర్లతో రూ. 3.54 కోట్లు, కే సిరియాళ రెండు సంఘాలకు రూ. 27.50 లక్షలు, స్వరాజ్యలక్ష్మి ఒక సంఘానికి రూ. 15 లక్షలు లోన్లు తీసుకున్నారు. గతేడాది ప్రారంభంలోనే ఏర్పాటైన సంఘానికి రూ. 20 లక్షలు లోన్ ఇప్పించారు. ఇలా మొత్తంగా రూ. 7.99 కోట్లు లోన్లు తీసుకోగా, విచారణ జరుగుతుందని తెలియగానే కొందరు రూ. 1.61 కోట్ల వరకూ చెల్లించారని తెలిసింది. ఇప్పుడు మొత్తంగా ఈ నలుగురు ఆర్పీలు కలిసి రూ. 6.38 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అక్రమ లోన్లపై నివేదిక
మైక్రో క్రెడిట్ ప్లాన్ లేకుండా సభ్యులే లేని ఫేక్ సంఘాలకు కెనరా బ్యాంకు ఇచ్చిన లోన్లపై నివేదిక రూపొందించారు. ఈ నివేదికను మెప్మా హయ్యర్ ఆఫీసర్లతో పాటు కెనెరా బ్యాంకు రీజినల్ మేనేజర్కు పంపించినట్టుగా తెలిసింది. నివేదికను రెండ్రోజులు ఆపాలని కోరడానికి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావును కెనెరా బ్యాంకుకు చెందిన ఓ హయ్యర్ ఆఫీసర్ కలిసే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. కాగా, జిల్లలోని చౌటుప్పల్లోనూ ఇదే విధంగా కొన్ని సంఘాలకు మైక్రో క్రెడిట్ ప్లాన్ లేకుండా లోన్లు ఇచ్చినట్టుగా, ఆయా సంఘాల నుంచి చెల్లింపులు రావడం లేదని తెలిసింది. దీంతో చౌటుప్పల్కు చెందిన పలు బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు ఇచ్చిన లోన్ల డేటాను ఆఫీసర్లు తెప్పించిట్టగా
తెలుస్తోంది.
