- జనం జాగ్రత్తగా ఉండాలె: డీహెచ్ శ్రీనివాసరావు
- సంక్రాంతి, ఇతర పండుగలు ఇంట్లనే చేసుకోవాలె
- 4 వారాలు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకోండి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జనవరి ఫస్ట్ నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాబోయే మూడు, నాలుగు వారాలు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెల చివరి నాటికి థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని, ఫిబ్రవరి మధ్యలో కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. థర్డ్ వేవ్ నుంచి ఆరు వారాల్లోనే బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ ఆరువారాలు కరోనా నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటే, ప్రజల మీదే ఎక్కువగా ఉందన్నారు.
అప్పుడలా..
డిసెంబర్30న: ఒమిక్రాన్ రావడం మంచిదే. దాన్నో బ్లెస్సింగ్ లా తీసుకోవాలి. ఇది కరోనాకు ముగింపు పలుకుతుంది. రెండేండ్ల నుంచి మనల్ని మనం కట్టేసుకున్నం. ఇప్పుడా పరిస్థితుల్లేవు. జాగ్రత్తగా ఉండాలే తప్ప మరీ లాక్ చేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్ను అడ్డుకోవడానికి స్ట్రిక్ట్ మెజర్స్ ఏమీ అవసరం లేదు. మాస్కులు పెట్టుకుని సినిమాలక్కూడా వెళ్లొచ్చు. రెండు డోసులూ వేసుకున్నోళ్లు పబ్బులు, బార్లు, పార్టీలకు కూడా శుభ్రంగా వెళ్లొచ్చు.
‑ శ్రీనివాసరావు, డీహెచ్
ఇప్పుడిలా..
జనవరి 6న: మాస్క్ పెట్టుకోవాలని, గ్యాదరింగ్స్కు దూరంగా ఉండాలని మేము చెబుతున్నాం. వాటిని పాటించే బాధ్యత ప్రజలదే. రోడ్డు మీద వెళ్తుంటాం.. వెహికిల్స్ ఎదురుగా వస్తుంటాయి. పక్కకు తప్పుకుంటేనే ప్రాణాలు ఉంటాయని తెలిసి కూడా ఎదురుగా వెళ్తామా ప్రాణాలు తీసుకోవడానికి.? ఇది(కరోనా) కూడా అంతే.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాలకు, పార్టీలకు, ట్రిప్లకు వెళ్లాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలె..