మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండల పరిధి స్కూల్ తండాలో ఘటన
మెదక్ టౌన్, వెలుగు: ఓ గిరిజన యువకుడు అను మానాస్పదంగా మృతిచెందడం ఇరువర్గాలు ఘర్షణకు దారితీసింది. నిలువరించేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడిచేయడంతోపాటు పోలీస్ వెహికిల్ ధ్వంసం చేశారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండల పరిధి స్కూల్ తండాలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని స్కూల్ తండాకు చెందిన మాలోత్ నవీన్(22) గురువారం అనుమానాస్పదంగా చెరువులో పడి మృతిచెందాడు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులు డెడ్ బాడీని తండాకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాగా నవీన్ మృతదేహంపై గాయాలు ఉన్నాయని, పాత కక్షలతో అతడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ బంధువులు అనుమానితులపై దాడికి దిగారు. హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై విఠల్, ముగ్గురు కానిస్టేబుల్లు తండాకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఎదురుతిరిగి, పోలీసుల బొలెరో వెహికిల్ను ధ్వంసం చేశారు. ముగ్గురు పోలీసులకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. మెదక్ రూరల్ సీఐ పాలవెళ్లి, రూరల్ ఎస్సై కృష్ణారెడ్డి సిబ్బంది బందోబస్తు మధ్య నవీన్ అంత్యక్రియలు జరిగాయి. గొడవ, పోలీసు వెహికిల్ ధ్వంసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.