
-
మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల విలువైన షేర్లపై తొలగనున్న రిస్ట్రిక్షన్లు
-
ఇప్పటికే భారీగా నష్టపోయిన పేటీఎం, నైకా, పీబీ ఫిన్టెక్, డెల్హివరీ
బిజినెస్ డెస్క్, వెలుగు: కొత్త తరం టెక్ కంపెనీలు కొత్త పరీక్షకు సిద్ధమవుతున్నాయి. ఐపీఓ తర్వాత పెద్ద షేరు హోల్డర్లపై (ఐపీఓ కంటే ముందు ఇన్వెస్ట్ చేసిన వారిపై) విధించిన లాకప్ పీరియడ్ కొన్ని కంపెనీల షేర్లపై ఈ నెలలో తొలగనుంది. దీంతో కనీసం 14 బిలియన్ డాలర్ల (రూ.1.14 లక్షల కోట్ల) విలువైన షేర్లను అమ్మేయడానికి పెద్ద షేరు హోల్డర్లకు వీలుంటుంది. వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాత్వే, జపనీస్ కంపెనీ సాఫ్ట్బ్యాంక్లు కొన్ని కొత్త తరం టెక్ కంపెనీల్లో షేరు హోల్డర్లుగా ఉన్నాయి. పేటీఎంను ఆపరేట్ చేస్తున్న వన్97 కమ్యూనికేషన్స్, నైకాను ఆపరేట్ చేస్తున్న ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ లిమిటెడ్, డెల్హివరీ, పాలసీ బజార్ను ఆపరేట్ చేస్తున్న పీబీ ఫిన్టెక్ షేర్లపై విధించిన లాకప్ పీరియడ్ ఈ నెలలో ముగియనుంది. షేరుహోల్డర్లు కంపెనీల లిస్టింగ్ అయిన ప్రారంభంలోనే తమ షేర్లను అమ్మేయకుండా ఉంచేందుకు లాకప్ పీరియడ్ను విధిస్తారు. దీంతో ఐపీఓ తర్వాత నుంచి కొంత టైమ్ వరకు కంపెనీల షేరు హోల్డర్లు అంటే వెంచర్ క్యాపిటలిస్టులు, ఫౌండర్లు, ఇతర షేరు హోల్డర్లు తమ షేర్లను అమ్ముకోవడానికి వీలుండదు. లాకప్ పీరియడ్ పూర్తయిన తర్వాత షేరు హోల్డర్లు తమ షేర్లను అమ్ముకోవచ్చు. కాగా, పెద్ద ఇన్వెస్టర్లు తమ షేర్లను వదిలించుకుంటే కంపెనీ షేరు తీవ్రంగా నష్టపోతుంది.
ఇంకా నష్టాల్లోనేనా?
వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నా చాలా టెక్ కంపెనీలు కిందటేడాది ఐపీఓ టైమ్లో అదరగొట్టాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగడంతో ప్రైమరీ మార్కెట్లో ఈ కంపెనీలు మంచి సక్సెస్ను చూశాయి. ఈ మధ్య కాలంలో కొత్త తరం టెక్ కంపెనీలు తమ ఐపీఓ ధర కంటే దిగువన ట్రేడవ్వడం చూస్తున్నాం. లాకప్ పీరియడ్ పూర్తయితే కంపెనీల ప్రధాన షేరుహోల్డర్లు కూడా తమ షేర్లను అమ్ముకోవడానికి వీలుంటుంది. అదే జరిగితే ఈ షేర్లు మరింత కిందకి పడొచ్చు. ‘ కొత్త తరం టెక్ కంపెనీలు భవిష్యత్లో లాభాలు బాట పడతాయనే అంచనాలతో వీటికి డిమాండ్ పెరుగుతోంది’ అని జీడబ్ల్యూ అండ్ కే ఇన్వెస్ట్మెంట్ పోర్టుఫోలియో మేనేజర్ టామ్ మసి అన్నారు. టెక్ కంపెనీలకు డిమాండ్ పెరగడంతో కిందటేడాది ఐపీఓకి వచ్చిన కంపెనీలు 18 బిలియన్ డాలర్ల (రూ.1.47 లక్షల కోట్ల) ను సేకరించగలిగాయి. టెక్ షేర్లు పడడంతో పాటు, గ్లోబల్గా రెసిషన్ భయాలు ఎక్కువవ్వడంతో ఈ ఏడాది ఐపీఓల సందడి తగ్గింది.
వాటాలు తగ్గించుకోవాలని చూస్తున్న సాఫ్ట్బ్యాంక్!
పేటీఎం షేర్లు తమ ఐపీఓ ధర నుంచి 70 శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీలో సాఫ్ట్బ్యాంక్ గ్రూప్కు, బెర్క్షైర్ హాత్వేకి, జాక్మాకి చెందిన యాంట్ గ్రూప్కు వాటాలు ఉన్నాయి. ఈ కంపెనీ షేర్లపై యాంకర్ ఇన్వెస్టర్ల లాకప్ పీరియడ్ ఈ నెల 15 న ముగుస్తుంది. దీంతో పెద్ద షేరుహోల్డర్లు తమ వాటాలను తగ్గించుకోవచ్చు. పెద్ద ఇన్వెస్టర్ల దగ్గర సుమారు 4.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయని అంచనా. స్టార్టింగ్ స్టేజ్లోనే పేటీఎంలో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్ కొంత ప్రాఫిట్స్ను బుక్ చేసే అవకాశం ఉంది. డెల్హివరీ, పీబీ ఫిన్టెక్లలో కూడా ఈ కంపెనీకి వాటాలు ఉన్నాయి. అతిపెద్ద షేర్ల బైబ్యాక్ ప్లాన్ను చేపట్టాలని సాఫ్ట్బ్యాంక్ చూస్తోంది. దీంతో వివిధ కంపెనీల్లో తన వాటాను తగ్గించుకుంటోందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
మరో ఇండియన్ టెక్ కంపెనీ జొమాటో షేర్లలో యాంకర్ ఇన్వెస్టర్ల లాకప్ పీరియడ్ ఈ ఏడాది ఆగస్టులో ముగిసింది. కంపెనీ షేర్లు ఆ తర్వాత 13 శాతం పెరిగాయి. కానీ, ఐపీఓ ధరతో పోలిస్తే ఇంకా 17 శాతం తక్కువకు ట్రేడవుతున్నాయి. టెక్ కంపెనీల నుంచి బయటకు వచ్చేద్దామనుకునే ఇన్వెస్టర్లకు మార్కెట్లో అనేక అవకాశాలు ఉన్నాయని, బాండ్ మార్కెట్లోనూ అవకాశాలు పెరిగాయని జీడబ్ల్యూ & కే ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన మసి పేర్కొన్నారు. కాగా, గ్లోబల్గా వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో బాండ్ మార్కెట్లో ఎక్కువ వడ్డీ దొరుకుతోంది. ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే మన స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. ఎంఎస్సీఐ వరల్డ్ ఇండెక్స్ ఈ ఏడాది 20 శాతం నష్టపోతే బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రం 4 శాతం పెరగడం విశేషం.