ఒక్కటే నెల్లో రూ.ఏడున్నర పెరగడంతో ఆటో డ్రైవర్లపై భారం
హైదరాబాద్, వెలుగు: ఆటో ఎల్పీజీ ధర ఒకే నెలలో రూ.7.50 పెరిగింది. జనవరిలో రూ.43 ఉన్న రేటు ఫిబ్రవరిలో రూ.50.53కు చేరింది. గతంలో ఎప్పుడూ ఒకేసారి ఇంత పెద్ద మొత్తం పెరగలేదు. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలతోనే ఇలా జరుగుతోందని యూనిగ్యాస్ లాజిస్టిక్ మేనేజర్ భాస్కర్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో లక్ష ఎల్పీజీ వెహికల్స్
హైదరాబాద్లో సుమారు లక్ష వరకు ఎల్పీజీతో నడిచే ఆటోలు ఉంటాయని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఇందులో దాదాపు 70 శాతం ప్యాసింజర్ ఆటోలు ఉంటాయంటున్నారు. రోజూ యావరేజ్గా ఒక్కో ఆటో డ్రైవర్ 10 కిలోల గ్యాస్ ఫిల్చేసుకున్నా రూ.75 అదనపు భారం పడుతుంది. సోమవారం, పండుగలు, వీకెండ్స్లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎల్పీజీ కోసం పెట్టాల్సిన ఖర్చు ఇంకా పెరుగుతుంది. ప్రతి నెలా ఒకటో తేదీన ఆటోగ్యాస్ ధరలు మారుతుంటాయని, నెలంతా అవే రేట్లు ఉంటాయని, కానీ ఈ నెలలో కాస్త ఎక్కువే పెరిగాయని ముషీరాబాద్లో యూనిగ్యాస్ ఆటోగ్యాస్ బంక్ల మేనేజర్ రవి చెప్పారు. గ్రేటర్లో ఏజీఎస్, రిలయన్స్, గో గ్యాస్ లాంటి 14 ఆటో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 100కు పైగా ఆటో ఎల్పీజీ బంకులుండగా, వీటి ద్వారా రోజూ 40 టన్ననుంచి 50 టన్నుల ఆటో ఎల్పీజీ వినియోగిస్తున్నారని యూనిగ్యాస్ అధికారులు చెబుతున్నారు.