- ఆర్థిక మోసాల్లో తప్పించుకుంటున్నారు
- వీళ్లకు సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రావడం లేదు..
- రూ. లక్షల కోట్లను దాచేందుకు రూ. వేల కోట్లు చెల్లిస్తున్న ధనవంతులు
బిజినెస్డెస్క్, వెలుగు: తాజాగా బయటపడిన పండోర పేపర్లు, గతంలో వెలువడిన పనామా పేపర్లు.. కామన్గా ఒక విషయం చెబుతున్నాయి.. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు ఏ దేశం అతీతం కాదని. కొంత మంది సంపన్నులు తమ దేశంలో ట్యాక్స్ను ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్యాక్స్లు తక్కువగా ఉండే దేశాల్లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయడం, తమ సంపదను ఆ దేశాలకు ట్రాన్స్ఫర్ చేయడం, సొంత దేశాల్లో తమ వద్ద రూపాయి కూడా లేదని చెప్పి దివాలా తీయడం వంటివి చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్లు జరిగేటప్పుడు మెయిన్ క్రిమినల్పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాయి మీడియా సంస్థలు, ఇతర రిపోర్టులు. కానీ, ఈ ఫ్రాడ్స్ను దగ్గరుండి జరిపించే ప్రొఫెషనల్స్ను పెద్దగా పట్టించుకోవు. కానీ, వీరే అన్నింటికి మూలమని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా కొన్ని సార్లు ఈ మధ్యవర్తులను వదిలేస్తున్నాయి. ధనవంతులు తమ సొంత దేశాల్లో ట్యాక్స్లను ఎగ్గొట్టేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో తాజాగా బయటపడిన పండోర పేపర్లు వివరించాయి. మీడియా కూడా ఈ పేపర్లలో ఉన్న కొంత మంది పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. కానీ, మీడియా కవరేజిలో కూడా రాని వారు చాలా మంది ఉన్నారు. ధనవంతులు ట్యాక్స్లను ఎగ్గొట్టడంలో, ఇతర దేశాలకు అక్రమంగా తమ సంపదను పంపించుకోవడంలో ఈ మధ్యవర్తులు సాయపడుతున్నారు. వీరు డైరెక్ట్గా ధనవంతులు కాకపోవచ్చు కానీ, మనీలాండరింగ్కు పాల్పడుతున్న రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ఇతరులకు తమ సేవలను అందించి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. ధనవంతులు కూడా రూ. లక్షల కోట్లను దాచిపెట్టడానికి, రూ. వేల కోట్లను ఫీజుల కింద వీరికి చెల్లించుకుంటున్నారు.
వెల్త్ను డిఫెన్స్ చేసే ఇండస్ట్రీ..
‘వెల్త్ డిఫెన్స్ ఇండస్ట్రీ’..ఈ పేరు ఈ మధ్య పాపులరవుతోంది. అడ్వైజర్ల నుంచి బ్యాంకర్లు, లాయర్లు, అకౌంటెంట్లు, నోటరీలు, ఎస్టేజ్ ఏజెంట్లు వంటి ప్రొఫెషనల్స్ ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. డొల్ల కంపెనీలు, ఫ్యామిలీ ఆఫీసులు, ఆఫ్షోర్ (విదేశీ) అకౌంట్లు, ట్రస్టులను వాడడం ద్వారా ధనవంతుల ట్యాక్స్ను ఎగ్గొటడంలో ఈ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్లు చేసిన వారి గురించి బయటకొస్తున్నప్పటికీ, ఈ ఫ్రాడ్లలో మధ్యవర్తులుగా పనిచేసే వారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియడం లేదు. డెలాయిట్ యాంటి మనీ లాండరింగ్ రిపోర్ట్ ప్రకారం, ఏటా దొంగతనంగా విదేశాలకు తరలిపోతున్న మనీ గ్లోబల్ జీడీపీలో 2–5 శాతంగా ఉంది. ఇది ఏడాదికి సుమారు 800 బిలియన్ డాలర్ల–ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. గ్లోబల్గా బ్యాంకులు ఎంత గుడ్డిగా మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయో పండోర పేపర్ల ద్వారా తెలుస్తోంది. అకౌంట్ హోల్డర్లను ఐడెంటీఫై చేయలేకపోయినా ట్రాన్సాక్షన్లు చేస్తున్నాయి. మనీలాండరింగ్ను గుర్తించడంలో ఫైనాన్షియల్ సంస్థలు ఫెయిలవుతున్నాయి.
మనీ లాండరింగ్పై కఠిన చట్టాలు, కానీ..
ఫైనాన్షియల్ ఫ్రాడ్లను గుర్తించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే చెపాలి. తక్కువ ట్యాక్స్లను విధించి, సీక్రెట్స్ను మెయింటైన్ చేసే దేశాలు ఈ ఫ్రాడ్స్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ను బయటపెట్టడం లేదు. ఇదే వెల్త్ డిఫెన్సర్లకు ఆయుధంగా మారుతోంది. పనామా పేపర్లు బయటపడిన తర్వాత నుంచి మనీ లాండరింగ్ చట్టాలను వివిధ దేశాలు కఠినతరం చేశాయి. ఇది మంచి విషయం. ఈ చట్టాలు సరిగ్గా అమలయితే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ను తగ్గించొచ్చు. చాలా దేశాలు మనీలాండరింగ్పై సీరియస్గా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రత్యేక సంస్థలు ఈ దర్యాప్తులు చేస్తున్నాయి. చట్టాలను అమలు చేయడంలో రాజకీయ నాయకులకు ఆసక్తి లేనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేశాల ప్రభుత్వాలు మనీ లాండరింగ్పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుండడం ఒక మంచి పరిణామం. గత కొంత కాలంగా ఎన్విరాన్మెంటల్, సోషియల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) విధానాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో వివిధ దేశాల సీనియర్ పొలిటికల్ లీడర్లు కూడా ఈ విధానాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ ఏడాది జూన్లో జీ7 దేశాలు గ్లోబల్ మినిమమ్ ట్యాక్స్ 15 శాతాన్ని విధించాలని నిర్ణయించుకున్నాయి. దీంతో కేవలం ట్యాక్స్లను ఎగ్గొట్టడానికే ఇతర దేశాలకు వెళ్లే కంపెనీలను అడ్డుకోవచ్చు.