- ఇబ్బందులు పడుతున్న మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, ఎగుమతిదారులు : జీటీఆర్ఐ
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం సంక్షోభం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత నష్టపోతామని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) చెబుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, కెమికల్స్, కన్జూమర్ గూడ్స్, మెషినరీ వంటి సెక్టార్లు ఎక్కువగా ఇబ్బంది పడతాయని వెల్లడించింది. ఎర్ర సముద్రం ద్వారా జరిగే రవాణాకు అంతరాయం ఏర్పడడంతో మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఇబ్బందుల్లో ఉన్నాయని, ముఖ్యంగా నిల్వలు తక్కువుగా ఉన్న కంపెనీలు నష్టపోతున్నాయని పేర్కొంది. సరైన టైమ్కు ముడి సరుకులు, కాంపోనెంట్లు అందడం లేదని వెల్లడించింది.
కాంపోనెంట్లు, ఫినిష్డ్ గూడ్స్ సూయెజ్ కెనాల్ ద్వారా వివిధ దేశాలకు రవాణా అవుతుంటాయి. ఎర్ర సముద్రంలోని షిప్లపై హౌతి రెబల్స్ దాడులు చేస్తుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే రవాణా ఖర్చు, ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చులు పెరిగిపోయాయి. యావరేజ్ కంటైనర్ రేట్లు (స్పాట్) కిందటి నెలతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. బాస్మతి రైస్ ఎగుమతుదారులు రవాణా కోసం 20 టన్నుల కంటైనర్కు 2,000 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.