
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్లో రెసిడెన్షియల్ ఇండ్ల రిజిస్ట్రేషన్లు కిందటి నెలలోనూ తగ్గిపోయాయి. ఫిబ్రవరి నెలలో రూ. 2,816 కోట్ల విలువైన 5,274 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు మాత్రమే చోటు చేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇవి 3 శాతం పడిపోయినట్లు. రిజిస్ట్రేషన్ రెవెన్యూ కూడా ఆ మేరకు స్వల్పంగా తగ్గిపోయినట్లు నైట్ఫ్రాంక్ తన రిపోర్టులో వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగా రెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్గా వ్యవహరిస్తారు.
రూ. 50 లక్షలలోపు ఇండ్ల వాటా 51 శాతం
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో రూ.25 నుంచి రూ. 50 లక్షల మధ్య విలువున్న ఇండ్ల వాటా 51 శాతంగా రికార్డయినట్లు నైట్ఫ్రాంక్ రిపోర్టు తెలిపింది. రూ. 25 లక్షల లోపు ఇండ్ల రిజిస్ట్రేషన్ల వాటా 18 శాతం వద్ద నిలిచినట్లు పేర్కొంది. రూ. కోటి అంతకు మించిన విలువైన ఇండ్లకే ఎక్కువ డిమాండ్ ఉందని స్పష్టం చేసింది. అదేవిధంగా 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల ప్రాపర్టీల వాటా 18 శాతానికి పెరిగిందని, వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల ప్రాపర్టీలే బాగా ఎక్కువగా అమ్ముడవుతున్నాయని నైట్ఫ్రాంక్ వెల్లడించింది. మొత్తం రెసిడెన్షియల్ ఇండ్లలో ఈ కేటగిరీ వాటా 68 శాతం వద్ద నిలిచిందని, కానీ అంతకు ముందు ఏడాది ఫిబ్రవరిలో ఈ వాటా 73 శాతమని పేర్కొంది.
జిల్లాల వారీగా చూస్తే మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వాటా 43 శాతమైతే, 39 % వాటాతో రంగా రెడ్డి జిల్లా ఆ తర్వాత ప్లేస్లో నిలుస్తోంది. ఫిబ్రవరి 2023 లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా 15 శాతం.
రేట్లు సంగారెడ్డిలో పెరిగాయ్...
వెయిటెడ్ ఏవరేజ్ ధరలను చూస్తే ఫిబ్రవరి 2023 లో 3 శాతం పెరిగాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ ధరలు బాగా ఎక్కువగా 9 శాతం పెరిగాయని నైట్ఫ్రాంక్ రిపోర్టు తెలిపింది.
వడ్డీ రేట్లు ఒకవైపు పెరుగుతున్నప్పటికీ హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ నిలకడగానే కదులుతోంది. రూ. 25 లక్షలు నుంచి రూ. 50 లక్షల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు హై వాల్యూ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఎక్కువయ్యాయి. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ ఆశాజనకంగానే ఉన్నట్లు.
‑ శామ్సన్ ఆర్థర్, సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ నైట్ ఫ్రాంక్ ఇండియా