- సీసీఎల్ఏ నుంచి ఎన్వోసీ తెప్పించుకుని పట్టాల మార్పిడి
- టెంపుల్ పేరిట 8 ఎకరాల భూమికి ఎసరు ?
నల్గొండ, వెలుగు : సర్కార్ భూములను ఆక్రమించేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు వెతుకుతున్నారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. భూదాన్ భూములతో పాటు, ప్రాజెక్టుల్లో భూమి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు సేకరిస్తున్న భూములను సైతం రికార్డుల నుంచి మాయం చేసే కుట్ర చేస్తున్నారు. పేదలకు పంపిణీ చేసిన భూదాన్ భూములకు పట్టాలు ఇప్పించేందుకు ఏకంగా సీసీఎల్ఏ స్థాయిలోనే పైరవీలు నడిపిస్తున్నారు. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లోనే జరుగుతున్న ఈ అక్రమాలకు సహకరించని ఆఫీసర్లపై ఇటీవల బదిలీ వేటు పడుతోంది. దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ, చింతపల్లి మండలాల్లో జరిగిన భూదందాలో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చేతులు మారిన భూదాన్ భూములు
చింతపల్లి మండలం కుర్మేడులోని 247 సర్వే నంబర్లో భూదాన్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. వందల ఎకరాల్లోని భూములను మాయం చేసేందుకు రూలింగ్ పార్టీకి చెందిన ముఖ్య నేతతో చేతులు కలిపిన పలువురు రియల్టర్లు రికార్డులనే తారుమారు చేస్తున్నారు. ఆచార్య వినోబాభావే ఈ మండలంలో పర్యటించిన టైంలో కొందరు పేద రైతులకు భూములను దానంగా ఇచ్చారు. ఇందులో భాగంగా సర్వే నంబర్ 247లో సుమారు పది ఎకరాల భూమిని పేదలకు పంచారు. ఈ సర్వే నంబర్లో భూదాన్ భూములు ఉన్నాయని ధరణి వెబ్సైట్లో కనిపించకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. ధరణి ప్రవేశపెట్టక ముందే ఐదారేళ్ల క్రితం ఈ సర్వే నంబర్లోని రెండు ఎకరాలను మరొకరికి అమ్మేందుకు యత్నించారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో భూదాన్ భూములుగా నమోదు కావడంతో క్లియరెన్స్ ఇచ్చేందుకు అప్పటి తహసీల్దార్ ఒప్పుకోలేదు. దీంతో పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వివాదం పెండింగ్లో ఉంది. తాజాగా ఈ భూములను
కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రియల్టర్లు రూలింగ్ పార్టీ ముఖ్య నేత సపోర్ట్తో రెవెన్యూ ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చారు. అయినా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆఫీసర్లు ఒప్పుకోకపోవడంతో రియల్టర్లు తమ పలుకుబడిని ఉపయోగించి ఈ సర్వే నంబర్ గురించి సీసీఎల్ఏలో ఎంక్వైరీ చేయించారు. భూదాన్భూములు ఉన్నాయని చూపిస్తున్నా.. వాటికి సంబంధించిన సర్వే నంబర్ సీసీఎల్ఏ రికార్డుల్లో లేకపోవడంతో పథకం ప్రకారం అక్కడి నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ తెప్పించారు. దీని ఆధారంగా ఫైల్ను చింతపల్లి తహసీల్దార్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కు పంపించారు. సీసీఎల్ఏ నుంచి ఎన్వోసీ ఉండడంతో 247 సర్వే నంబర్లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆ భూముల్లో రియల్టర్లు భారీ స్థాయిలో వెంచర్లు చేస్తున్నారు. హైదరాబాద్ – -నాగార్జునసాగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కుర్మేడులో ప్రస్తుతం ఎకరం భూమి రూ. రెండు కోట్లు పలుకుతోంది. దాదాపు రూ.20 కోట్ల విలువైన భూదాన్ భూములు చేతులు మారడంతో ఇదే సర్వే నంబర్లోని కొందరు రైతులు ఆందోళనకు దిగారు. రూల్స్ ప్రకారం భూదాన్ భూములను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి తప్ప క్రయ విక్రయాలకు వీలు లేదంటూ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు.
టెంపుల్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు సర్కార్ భూములు
నల్గొండ జిల్లా చింతపల్లి, మర్రిగూడెం మండలంలో ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మిస్తోంది. దీనిలో భాగంగా మర్రిగూడెంలో ముంపునకు గురవుతున్న బాధిత కుటుంబాలకు చింతపల్లిలో పునరావాసం కల్పించేందుకు సర్వే నంబరు 154లో 95 ఎకరాల ప్రభుత్వ భూమిని
ఆర్అండ్ఆర్ కింద అనౌన్స్ చేశారు. ఇందులో సుమారు 8 ఎకరాల భూమిని నోటిఫికేషన్ నుంచి డిలీట్ చేసి గుడి నిర్మాణం కోసమంటూ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రూ. 2 కోట్లతో డీల్ కుదిరినట్లు సమాచారం. భూమిని నోటిఫికేషన్ నుంచి తొలగించి టెంపుల్కు అప్పగించాలంటూ కేబినెట్ అప్రూవల్ ఉండాలి. దీంతో అధికార పార్టీ ముఖ్యనేత, మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులు కలిసి జిల్లా ముఖ్య నేతను సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ ల్యాండ్ను నోటిఫికేషన్ నుంచి తొలగించాలని రెవెన్యూ ఆఫీసర్పై ఒత్తడి చేయగా అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో అతడిని ట్రాన్స్ఫర్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆఫీసర్పై బదిలీ వేటు
దేవరకొండ మండలంలోని శేరిపల్లి శివారు ప్రాంతాల్లో సుమారు 300 ఎకరాల వరకు కాందిశీకుల భూములు ఉన్నాయి. ఈ ఏరియాలో ఎక్కువగా కొండలు, గుట్టలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు మార్కెట్లో కోట్లు పలుకుతుండడంతో వీటిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేయాలని ఓ ఆఫీసర్పై ఒత్తడి తేవడం, అతడు ఒప్పుకోకపోవడంతో సదరు అధికారిని కలెక్టరేట్కు ట్రాన్స్ఫర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్వోసీ ఇచ్చినందునే రిజిస్ట్రేషన్ చేశాం
సర్వే నంబరు 247 నిషేధిత జాబితాలో ఉన్నది నిజమే. అయితే పట్టా మాత్రం రైతుల పేరు మీదనే ఉంది. సీసీఎల్ఏ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకురావడంతో కలెక్టర్ పర్మిషన్తోనే రిజిస్ట్రేషన్లు చేశాం.
– విశాలాక్షి, తహసీల్దార్, చింతపల్లి