గిన్నిస్ దిశగా  కంటి వెలుగు.. 83 రోజుల్లో 1.54 కోట్ల మందికి టెస్టులు

గిన్నిస్ దిశగా  కంటి వెలుగు.. 83 రోజుల్లో 1.54 కోట్ల మందికి టెస్టులు

గిన్నిస్ దిశగా  కంటి వెలుగు
83 రోజుల్లో 1.54 కోట్ల మందికి టెస్టులు
గడువు ముగిసేలోగా ఇంకో 26 లక్షల మందికి పరీక్షలు చేయాలని టార్గెట్
ఆ తర్వాత గిన్నిస్‌‌కు అప్లై చేసే యోచనలో‌‌ సర్కారు
మరికొన్ని రోజుల్లో ముగియనున్న స్క్రీనింగ్
ఇంకో 26 లక్షల మందికి పరీక్షలు చేయాలని టార్గెట్
ఆ తర్వాత గిన్నిస్‌‌కు అప్లై చేసే యోచనలో‌‌ సర్కారు

హైదరాబాద్, వెలుగు : కంటి వెలుగు రెండో దశ స్ర్కీనింగ్  గిన్నిస్‌‌  బుక్‌‌  రికార్డు దిశగా ముందుకు సాగుతోంది. వంద రోజుల్లో 1.8 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి గిన్నిస్‌‌లోకి ఎక్కాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. ఇప్పటి వరకూ 83 రోజుల్లో 1,54,58,982 మందికి టెస్టులు చేశారు. ఇంకో 17 రోజులు స్ర్కీనింగ్  నిర్వహించాల్సి ఉండగా, టార్గెట్‌‌ చేరుకోవడానికి సుమారు ఇంకో 25.5 లక్షల మందికి టెస్టులు చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడంతో క్యాంపుల నిర్వహణ కష్టంగా మారింది.

జనాలు కూడా ఎండలకు భయపడి టెస్టులకు రావడం లేదు. ఈ నేపథ్యంలో టార్గెట్  చేరుకుంటామా లేదా అన్న ఆందోళన ప్రభుత్వంలో నెలకొంది. ఈ నేపథ్యంలో గడువులోగా లక్ష్యాన్ని చేరుకునేలా క్యాంపులు నిర్వహించాలని, జనాలను మోటివేట్  చేసి కంటి పరీక్షలు చేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇతర డిపార్ట్‌‌మెంట్ల సహకారం తీసుకోనున్నారు.

17 లక్షల మందికి సైట్

కంటి పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో పాతిక మందికి కంటి సమస్య ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సుమారు 17.58 లక్షల మందికి సైట్  ప్రాబ్లమ్స్ ఉన్నట్లు గుర్తించి కళ్లద్దాలు ప్రిస్క్రైబ్ చేశారు. సమస్య తీవ్రత తక్కువగా ఉన్న 21.85 లక్షల మందికి రీడింగ్  గ్లాసెస్ అందజేశారు. అయితే, కంటి వెలుగు తొలి దశలో కంటే ఈసారి కంటి సమస్యలు ఉన్న వారి సంఖ్య తగ్గడం గమనార్హం. కంటి వెలుగు తొలి దశ కార్యక్రమం 2018లో జరిగింది. 

అప్పుడు మొత్తం ఒక కోటి 54 లక్షల మందికి టెస్టులు చేశారు. అందులో 50,39,000 (32 శాతం) మందికి రకరకాల కంటి సమస్యలు ఉన్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన వారికి కంటి సమస్యలు లేవని తెలిపింది. రెండో దశ స్క్రీనింగ్‌‌లో ఇప్పటి వరకూ 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయగా,  ఇందులో 39,44,000 (25 శాతం) మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. సుమారు 7 శాతం తగ్గుదల నమోదు కావడంపై డాక్టర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

2018 నాటితో పోలిస్తే, ఇప్పుడు స్క్రీన్ టైమ్  మరింత పెరిగింది. కరోనా లాక్‌‌డౌన్, ఆన్‌‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం తదితర కారణాలతో స్ర్కీన్ టైమ్  విపరీతంగా పెరిగింది. దీంతో చాలా మంది కంటి సంబంధిత సమస్యల బారిన పడ్డారు. ఈ లెక్కన కంటి వెలుగు రెండో దశ స్ర్కీనింగ్‌‌లో కనీసం 40 శాతం మందిలో కంటి సమస్యలు బయటపడతాయని డాక్టర్లు అంచనా వేశారు. కానీ, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ 25 శాతం మందిలోనే కంటి సమస్యలు ఉన్నట్లు తేలడం గమనార్హం.

లక్షల మందికి సమస్య

రాష్ట్రంలో 11,862 గ్రామ పంచాయతీల్లో కంటి వెలుగు క్యాంపులు నిర్వహించారు. ఇంకో 506 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం క్యాంపులు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని 3,495 వార్డుల్లో స్క్రీనింగ్  జరపగా.. మరో 258 వార్డుల్లో క్యాంపులు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన గ్రామాలు, పట్టణాలతో పాటు ఓ వారం రోజుల పాటు మాస్ క్యాంపెయినింగ్ నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లు, బస్టాండ్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల టార్గెట్‌‌ను రీచ్ అవడంతో పాటు జనాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.