కార్మిక చట్టాల ఉల్లంఘనలో రాష్ట్ర ప్రభుత్వమే దోషి 

కార్మిక చట్టాల ఉల్లంఘనలో రాష్ట్ర ప్రభుత్వమే దోషి 

నాగర్​ కర్నూల్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో కార్మిక చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని జాతీయ లేబర్​ బోర్డ్​ చైర్మన్​ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ఉల్లంఘనలో రాష్ట్ర ప్రభుత్వమే దోషి అని ఆరోపించారు. ఈ మేరకు కేంద్రానికి, పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీకి నివేదిక సమర్పిస్తామన్నారు. శుక్రవారం ఆయన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం, నార్లాపూర్​ అండర్​ గ్రౌండ్​ పంప్​హౌజ్, సర్జ్​పూల్, హెడ్​ రెగ్యులేటర్​ పనులను పరిశీలించారు. అక్కడ రక్షణ, భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం లేదని గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు, లేబర్ ​కాంట్రాక్టర్ల వివరాలు, లైసెన్స్​ తదితర అంశాలపై ప్రశ్నించగా ఆఫీసర్లు అందుబాటులో లేవని చెప్పడంతో మండిపడ్డారు. లేబర్​లైసెన్స్​లేకుండా ఆరున్నర ఏండ్లుగా ఇంత భారీ ప్రాజెక్టు పనులు ఏవిధంగా కొనసాగించారని నిలదీశారు. నార్లాపూర్ ​పంప్​హౌజ్, సర్జ్​పూల్​లో పనిచేసేందుకు 100 లేబర్​ పర్మిషన్​ ఉన్న కాంట్రాక్టర్ ​వందలాది మందితో పని చేయించడం ఏమిటని ప్రశ్నించారు. 15 రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వకపోతే ఈఎన్ సీకి నోటీసులు ఇవ్వాలని అసిస్టెంట్​లేబర్ కమిషనర్​ను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, ఇందులో 8 లక్షల మందికి రెన్యువల్​ కాలేదంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. కరోనా తర్వాత కేంద్రం కార్మికులను ఆదుకునేందుకు ఇచ్చిన ఆర్థిక సహాయం, కార్మిక సంక్షేమ మండలి బోర్డు డబ్బులు రూ.1,004 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఆయనతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్​రావు, నాగర్​కర్నూల్​ నియోజకవర్గ ఇన్​చార్జి దిలీపాచారి ఉన్నారు.