సుప్రీంకోర్టులో ఝార్ఖండ్‌ సీఎంకు షాక్‌..

సుప్రీంకోర్టులో ఝార్ఖండ్‌ సీఎంకు షాక్‌..

ఢిల్లీ : ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన సమన్లను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. దీనిపై ఝార్ఖండ్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో హేమంత్ సోరెన్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు విచారణకు రావాలని ఈడీ హేమంత్‌ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14, ఆగస్టు 24వ తేదీల్లో సోరెన్‌ గైర్హాజరయ్యారు. దాంతో సెప్టెంబర్ 9వ తేదీన రాంచిలోని తమ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ మరోసారి సమన్లు ఇచ్చింది. అయితే.. జీ20 సదస్సు నేపథ్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి విందుకు హాజరయ్యేందుకు సోరెన్‌ మరోసారి విచారణకు వెళ్లలేదు.

ALSO READ: సాయంత్రం 6:30 గంటలకు... కేంద్ర కేబినేట్ భేటీ

ఈ క్రమంలోనే ఈడీ సమన్లను సవాల్‌ చేస్తూ హేమంత్‌ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోరెన్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం.. ఝార్ఖండ్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో హేమంత్ సోరెన్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈడీ సమన్లపై ఆయన ఝార్ఖండ్‌ హైకోర్టుకు వెళ్లనున్నారు. 

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సోరెన్‌ను గతేడాది నవంబరులో ఈడీ 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే.