టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు 

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు 

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సభ్యుల నియామకంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం (జూన్ 16వ తేదీన) కీలక తీర్పు ఇచ్చింది. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని  పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రమావత్ ధన్ సింగ్, ఆర్.సత్యనారాయణ, సుమిత్ర ఆనంద్ తనోబా, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆరవెల్లి చంద్రశేఖర్ నియామకం పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ.. వరంగల్ కాకతీయ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ. వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై శుక్రవారం (జూన్ 16న) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021, మే 19వ తేదీన రాష్ట్ర  ప్రభుత్వం108 జీవో జారీ చేసింది. టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు ఆరుగురు సభ్యులకు అర్హతలు, విశిష్టతలు లేవని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలను తాజాగా హైకోర్టు పరిశీలించాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని సూచించింది. ఆరుగురు సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న ప్రస్తుత దశలో అవసరం లేదని హైకోర్టు చెప్పింది. ఆరుగురు సభ్యుల నియామకం ప్రభుత్వ తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని పేర్కొంది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది.