హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం (మే 25న) రిలీజ్ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మాసబ్ ట్యాంకులోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలో ఏడు, ఎనిమిది, పది ర్యాంకుల్లో నిలిచారు. సనపాల అనిరుధ్ (విశాఖపట్టణం) తొలి ర్యాంకు సాధించగా, మణింధర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వరుణ్(నందిగామ) మూడో ర్యాంకు, అభిణిత్ మజేటి(హైదరాబాద్) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రి) ఐదో ర్యాంకు, మారదన ధీరజ్(విశాఖపట్టణం) ఆరో ర్యాంకు, వడ్డే శాన్విత(నల్లగొండ) ఏడో ర్యాంకు, బోయిన సంజన(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబ్రాది పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. అగ్రికల్చర్ పరీక్షలో 84 శాతం మంది అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు.
గతంలో జరిగిన తప్పిదాలను దృష్ట్యా.. చాలా జాగ్రత్తలు తీసుకుని ఎగ్జామ్స్ నిర్వహించామని మంత్రి సబిత తెలిపారు. 137 సెంటర్లలో ఎగ్జామ్స్ నిర్వహించామన్నారు. ఈసారి అనుకున్న సమయం ప్రకారమే ఫలితాలను విడుదల చేశామని వివరించారు. మొత్తం 21 జోన్లలో పరీక్షలు నిర్వహించామన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ను రెండు, మూడు రోజుల విడుదల చేస్తామని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు మంత్రి సబిత.
ఎంసెట్ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి.
ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.
* అగ్రికల్చర్, ఫార్మాలో 86శాతం ఉత్తీర్ణత
* ఇంజనీరింగ్ లో 80శాతం ఉత్తీర్ణత
* ఇంజనీరింగ్ పరీక్షకు హాజరైన లక్షా 95 వేల 275 మంది విద్యార్థులు
* అగ్రికల్చర్ విభాగంలో పరీక్ష రాసిన లక్షా 6 వేల514 మంది విద్యార్థులు
* పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరు
* కౌన్సెలింగ్ కోసం త్వరలోనే తేదీలను ప్రకటించే ఛాన్స్
* మార్కులు ఆధారంగానే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మా కోర్సులో ర్యాంకులు
* స్థానిక అభ్యర్థుల కోసం రాష్ర్ట కోటా కింద 85శాతం సీట్లు
* 15శాతం సీట్లు ఇతర రాష్ర్టాల విద్యార్థుల కేటాయింపు