వాషింగ్టన్: కరోనాకు కారణం చైనాయేనని అమెరికా మరోసారి ఆరోపించింది. ఈవిషయంలో చైనా మూల్యం చెల్లించక తప్పదని ఫారిన్ మినిస్టర్ మైక్ పాంపియో కూడా వార్నింగ్ ఇచ్చారు. కరోనా గురించి చైనాకు డిసెంబర్ లోనే సమాచారం ఉన్నప్పటికీ ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదని ఆయన విమర్శించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) కూడా కరోనా వ్యాప్తిని అరికట్టటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అమెరికాలోని ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్ మాట్లాడారు. వుహాన్ నుంచే వైరస్ పుట్టిందన్నది ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తామన్నారు. చైనా నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ప్రపంచం బాధపడుతోందని, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపడతామని పాంపియో చెప్పారు.
ఆ మాటలు వెటకారంగానే అన్నా: ట్రంప్
‘‘కరోనా సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కాంతి, వేడి, డిస్ ఇన్ఫెక్టెంట్లతో నాశనమవుతుంది కాబట్టి, పేషెంట్లకు కూడా వీటితో ట్రీట్ మెంట్ చేయడం గురించి ఆలోచించాలి. కరోనా పేషెంట్ల బాడీల్లోకి యూవీ లైట్ ను ఏదోలా పంపడం లేదా డిస్ ఇన్ఫెక్టెంట్లను ఇంజెక్ట్ చేయడం వంటివి ప్రయత్నించాలి’’ అని గురువారంనాటి మీడియా సమావేశంలో కామెంట్లు చేసి, అభాసుపాలైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారం దీనిపై వివరణనిచ్చారు. తాను వెటకారంగా మాత్రమే ఈ కామెంట్లు చేశానని అన్నారు. ట్రంప్ కామెంట్స్ను మీడియాతో పాటు హెల్త్ నిపుణులు తీవ్రంగా విమర్శించారు. దీంతో ట్రంప్ కామెంట్లను మీడియా మరో అర్థంలో తీసుకుందని వైట్ హౌజ్ అధికారులు ప్రకటన జారీ చేశారు.
మీడియాకు దూరం
చేసిన కామెంట్లు వివాదాస్పదం కావడంతో.. ట్రంప్ మీడియాకు శుక్రవారం దూరంగా ఉన్నారు. ప్రతిరోజూ వైట్ హౌజ్ దగ్గర మీడియా సమావేశం పెట్టి, కరోనా సంక్షోభంపై బ్రీఫింగ్ ఇస్తూ వచ్చిన ఆయన తాజా వివాదంతో విలేకరుల ముందుకు రాలేదు. ట్రంప్, విలేకరులకు మధ్య తరచూ గొడవ జరుగుతుండటం, సమావేశం గంట వరకూ కొనసాగుతుండటంతో చాలా ముఖ్యమైన విషయం ఉంటే తప్ప మీడియా ముందుకు రావద్దని ట్రంప్ కు ఆయన సలహాదారులు సూచించినట్లు మీడియా
వెల్లడించింది.
3 రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపు..
ఆసియాలోని పలు దేశాల్లో కరోనా బలహీనం కావడం, పలు దేశాల్లోనూ పరిస్థితి మెరుగుపడుతూ, ఆంక్షలను సడలిస్తున్నందువల్ల అమెరికాలోని మూడు రాష్ట్రాలూ లాక్ డౌన్ రూల్స్ ను సడలిస్తున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న ఎకానమీని కోలుకునేలా చేసేందుకు జార్జియా, ఒక్లహామా, అలాస్కా రాష్ట్రాలు రూల్స్ ను సడలించాయి. ఇది చాలా తొందరపాటు చర్య అని, వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉందని హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జార్జియా, ఒక్లహామా రాష్ట్రాల్లో సెలూన్లు, స్పాలను తిరిగి తెరిచేందుకు గవర్నర్లు అనుమతించారు. అలాస్కాలోనూ రెస్టారెంట్లు, రిటైల్ షాపులు, ఇతర దుకాణాలు తెరుచుకున్నాయి. అలాస్కాలోని కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం రూల్స్ ఇంకా స్ట్రిక్టుగా అమలు చేస్తున్నారు.
క్లోరోక్విన్తో గుండె లయ తప్పుతది: ఎఫ్డీఏ
కరోనా పేషెంట్లకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ బాగా పని చేస్తుందని తేలడంతో అన్ని దేశాలూ దీని కోసం ప్రయత్నిస్తున్నాయి. దీంతో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని, గుండె లయ తప్పి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిస్తోంది. క్లోరోక్విన్ కారణంగా పేషెంట్లకు గుండె సమస్యలు రావచ్చని తెలిపింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేయాలని సూచించింది. కరోనా పేషెంట్ పరిస్థితిని బట్టి డాక్టర్లే ఏ మందు ఇవ్వాలనేది నిర్ణయించాలని చెప్పింది. ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఇవ్వాలని స్పష్టం చేసింది.