- ఇంటర్నల్ మెడిసిన్ వైద్య నిపుణులు డా ఎల్.సంజయ్
వాక్సిన్ తో అన్ని రకాలుగా ప్రయోజనమేనని ఇంటర్నల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్.సంజయ్ స్పష్టం చేశారు. అన్ని రకాల అపోహలూ తొలగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత శరీర తత్వాన్ని బట్టి కేవలం జ్వరం, అలసట, చేతుల వాపు వంటివి రావచ్చునని ఆయన తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డల్లో, చిన్నారులు కోవిడ్ పాజిటివ్స్ అవుతున్నా.. లక్షణాలు స్వల్పంగా ఉంటే త్వరగానే కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. చిన్నారుల్లో జ్వరం, దగ్గు, న్యూమోనియా, గొంతు నొప్పి, విరేచనాలు, నీరసం వంటి లక్షణాలు పాజిటివ్ లక్షణాలు కనపడుతున్నాయన్నారు. కరోనా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి మీద మాత్రమే కాదు యువత, చిన్నారులు, పసిపిల్లలు టీనేజర్లతో సహా... అందరి ఆరోగ్యంగా ఉన్నవారిపైనా కోవిడ్ దాడి చేస్తోంది. కాబట్టి ఎవరూ నాకు రాదు అనుకోకుండా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
వ్యాక్సిన్ తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరం కరోనా వైరస్తో పోరాడే యాంటీ బాడీస్ని తయారు చేయడం మొదలుపెడుతుంది. అత్యధిక శాతం జనాభా వ్యాక్సినేషన్ పూర్తయితే హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది. తద్వారా సామాజిక భధ్రతతో పాటు సామాజిక వ్యాప్తికి కూడా అడ్డుకట్టపడుతుంది. తీవ్రత నుంచి రక్షణ కలుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్స్ వ్యాధి తీవ్రతను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి కాబట్టి, వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ అలా కోవిడ్ సోకిన వారిలో మాదిరి వ్యాధి తీవ్రంగా మారే అవకాశం ఉండదు అని ఆయన చెప్పారు. ఇన్ఫెక్షన్ సోకిన ఇతరులతో పోలిస్తే వారిలో చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ తర్వాత దాదాపుగా అందరికీ ఆసుపత్రి పాలయ్యే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం తప్పుతుందనే చెప్పొచ్చు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటివి తప్పనిసరి జాగ్రత్తలన్నీ అత్యధిక శాతం జనాభాకి వ్యాక్సినేషన్ పూర్తయేవరకూ తప్పదు. ఒకసారి హర్డ్ ఇమ్యూనిటీ అనేది అభివృద్ధి చెందితే మాస్కులు ధరించాల్సిన అవసరం కూడా తగ్గిపోతుందని ఆయన వివరించారు.