
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రాజ్ భవన్లో చోరీ తీవ్ర కలకలం రేపింది. రాజ్ భవన్ ఫస్ట్ ఫ్లోర్లోని సుధర్మ భవన్లో హార్డ్ డిస్క్లు చోరీకి గురయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా చోరీ జరిగినట్లు గుర్తించిన రాజ్ భవన్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సుధర్మ భవన్లో హార్డ్ డిస్క్లు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల (మే) 14న చోరీ జరిగినట్లు తెలిపారు.
ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని కంప్యూటర్లోకి వెళ్లి హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు చెప్పారు. చోరీకి గురైన హార్డ్ డిస్కులలో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే రాజ్ భవన్లో చోరీ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్ భవన్లో చోరీ ఘటనను సీరియస్గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.
రాజ్ భవన్ చోరీ కేసు నిందితుని అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. చోరీకి గురైన హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా గుర్తించారు. హార్డ్ డిస్క్లు ఎందుకు చోరీ చేశాడు..? ఎవరు చేయమన్నారు..? హార్డ్ డిస్క్లోని డేటాను ఏమైనా దుర్వినియోగం చేశాడా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.