జమ్మికుంట బల్దియాలో హైడ్రామా

జమ్మికుంట బల్దియాలో హైడ్రామా
  •     శిబిరాలు మారుతున్న కౌన్సిలర్లు 
  •     చైర్మన్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా 22 మంది కౌన్సిలర్ల సంతకాలతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ

కరీంనగర్, వెలుగు:  జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుపై కౌన్సిలర్ల అవిశ్వాస ప్రక్రియలో హైడ్రామా నెలకొంది. ఆయనకు మద్దతుగా 22 మంది సంతకాలతో కూడిన లేఖను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో  కొందరు కౌన్సిలర్లు శనివారం కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. 

కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య నేతృత్వంలో  రాజేశ్వర్ రావుకు వ్యతిరేకంగా 20 మంది సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసును శుక్రవారం డీఆర్వోకు అందజేసిన విషయం తెలిసిందే.  ఆ వెంటనే వారంతా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో క్యాంప్‌‌‌‌‌‌‌‌నకు తరలివెళ్లారు. మరుసటి రోజే 22 మంది సంతకాలతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లెటర్​ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. 30 మందిలో మెజార్టీగా 16 మంది కౌన్సిలర్లు తమ క్యాంపులోనే ఉన్నారని బీఆర్ఎస్ రెబల్ పొనగంటి మల్లయ్య చెప్తుండగా.. 22 మద్దతు తనకే ఉందని రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అంటున్నారు. 
 

మల్లయ్య క్యాంపు నుంచి ముగ్గురు వాపస్.. 

తొలుత పొన్నగంటి మల్లయ్యకు మద్దతు ఇచ్చిన 20 మందిలో ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి ప్రస్తుత చైర్మన్ రాజేశ్వరరావు శిబిరంలో చేరారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..16 మంది మల్లయ్య క్యాంపులో ఉండగా, 13 మంది రాజేశ్వర్ రావుతో ఉన్నట్లు తెలుస్తోంది. 10వ వార్డ్ కౌన్సిలర్ పొన్నగంటి విజయలక్ష్మి మాత్రం న్యూట్రల్ గా ఉన్నారు. 

శనివారం వాపస్ వచ్చిన ముగ్గురిలాగే మరో ఇద్దరు మల్లయ్య క్యాంపు నుంచి వస్తే తన కుర్చీకి ఢోకా లేదని రాజేశ్వర్ రావు భావిస్తుండగా.. ఎవరూ చేజారకుండా మల్లయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.  దీంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాస సమావేశానికి  ప్రకటించే తేదీపై ఉత్కంఠ నెలకొంది.కాగా అసెంబ్లీ ఎన్నికల టైంలో నవంబర్ 23న కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్యపై అనర్హత వేటు వేయాలని పార్టీ విప్ జారీ చేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్ సదానందం కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. 

సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో అవిశ్వాసం 

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీతపై బీఆర్ఎస్ (సొంత పార్టీ) కౌన్సిలర్లతోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం అడిషనల్ కలెక్టర్ జె. అరుణశ్రీకి అవిశ్వాస నోటీసు అందజేశారు. కొంతకాలంగా చైర్ పర్సన్ కు, కౌన్సిలర్లకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. 

బీఆర్ఎస్ పార్టీకే చెందిన కౌన్సిలర్లు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌పై నాటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి, పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస నోటీసు అందజేసినప్పటికీ న్యాయపరమైన ఇబ్బందుల వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా 12 మంది కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ ను కలిసి అవిశ్వాస నోటీసు అందజేశారు.