హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన సేవలు అందించాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్డైరెక్టర్ వీసీ సజ్జనార్ చెప్పారు. మంగళవారం సిటీలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ ప్రైస్ రివిజన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు. బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూప్లకు సంబంధించిన ధరలను నిర్థారించారు. కీలకమైన స్టాండింగ్ కమిటీకి తాను ఛైర్మన్ గా ఎన్నికైనందుకు తనకెంతో సంతోషంగా ఉందని సజ్జనార్చెప్పారు. ఈ సమావేశంలో ఏఎస్ఆర్టీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యకిరణ్, డైరెక్టర్ ఆర్ఆర్కే కిషోర్, టీఎస్ఆర్టీసీ సీఎంఈ రఘునాథరావుతో పాటు 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.