
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ కేసులు పెరుగుతున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం కరోనా ప్రభావం లేదు. ఇప్పటిదాకా 216 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అవన్నీ సేఫ్ జోన్లో ఉన్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో కరోనా పరిస్థితిపై వివరాలు వెల్లడించింది. లాక్డౌన్ రూల్స్ ప్రకారం చేయాల్సినవి, చేయకూడనివి పాటిస్తే కేసులు పెరగకుండా చూడొచ్చని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. కోలుకుంటున్నోళ్ల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటిదాకా 17,884 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని, అది మొత్తం కేసుల్లో 30 శాతమని అన్నారు. శుక్రవారం ఒక్కరోజే 1,108 మంది కోలుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 హాస్పిటళ్లలో ప్లాస్మా థెరపీపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టడీ చేస్తుందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, కర్నాటక, చండీగఢ్, పంజాబ్లలో ట్రయల్స్ జరుగుతాయన్నారు. 5,231 రైల్వే కోచ్లను కరోనా కేర్ సెంటర్లుగా మార్చారన్నారు. వాటిని 215 రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేశామన్నారు. తక్కువ ఎఫెక్ట్ ఉన్న కరోనా పేషెంట్లకు అక్కడే ట్రీట్మెంట్ చేస్తామన్నారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నందున కరోనా వ్యాపించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. వలస కూలీలు కూడా ప్రభుత్వ చర్యలను అర్థం చేసుకోవాలని, అంతా వాళ్ల మంచి కోసమే చేస్తున్నామని చెప్పారు.
రెండున్నర లక్షల మందిని తరలించాం
రైల్వేస్ ఇప్పటిదాకా రెండున్నర లక్షల మంది వలస కూలీలను తరలించిందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. వాళ్లను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు 222 ప్రత్యేక రైళ్లను నడిపామని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ చెప్పారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని విడతల వారీగా తీసుకొస్తామని, దానికి సంబంధించి ఇప్పటికే పనులు మొదలయ్యాయని ఆమె చెప్పారు. ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖ, హోం శాఖ, విమానయాన శాఖ, ఆర్మీ, ఎయిరిండియాలోని నిపుణులతో వేసిన ఇంటర్మినిస్టీరియల్ కోఆర్డినేషన్ కమిటీ దీనిపై విధివిధానాలను తయారు చేసిందన్నారు. ఔరంగాబాద్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఆమె ఆవేదన
వ్యక్తం చేశారు.
60 వేల మంది ఇంట్లోనే.. కాలనీ మొత్తం సీల్
కేసులు పెరగడంతో చండీగఢ్లోని ఓ కాలనీ మొత్తాన్ని అధికారులు మూసేశారు. దీంతో 60 వేల మంది ఇండ్లకే పరిమితమయ్యారు. బాపూధామ్ కాలనీలో 76 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ కాలనీ మొత్తాన్ని అధికారులు సీల్ చేసేశారు. కంటెయిన్మెంట్ జోన్గానే కాకుండా బఫర్జోన్గానూ ఆ ఏరియాను ప్రకటించారు. కాలనీ మొత్తాన్ని కంటెయిన్మెంట్ జోన్ చేశారు.
1,900 మరణాలు
దేశంలో కేసుల సంఖ్య 59,642కి చేరింది. శుక్రవారం 3,291 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 17,884 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం 96మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,985కి పెరిగింది. మహారాష్ట్రంలో కేసులు 19 వేలు దాటాయి. మొత్తం 19.063కేసులు నమోదయ్యాయి. 731 మంది చనిపోయారు.