- 24వ రోజు పాదయాత్రలో షర్మిల
అధికార పక్షంలో గాని.. ప్రతిపక్షంలో గాని ప్రజలవైపు నిలబడి మాట్లాడే వాళ్లు లేరని.. అందుకే తాను వచ్చానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. తాను పార్టీ పెట్టింది ప్రజల వైపు నిలబడేందుకు.. ప్రజల పక్షాన పోరాడేందుకేనన్నారామె. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర 24వ రోజు నల్గొండ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరింది. వనిపాకలలో యాత్ర ప్రారంభించి.. రామన్నపేటలో జనంతో మాటముచ్చటతో ముగించారు షర్మిల. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం నుంచి ప్రారంభించి వనిపాకలలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నడక మొదలు పెట్టారు. అడుగడుగున్నా స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.
పాదయాత్రలో పలుచోట్ల జనాలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. రైతులకు రుణమాఫీ లేక.. ఇన్ పుట్ సబ్సిడీ లేక.. నాణ్యమైన విత్తనాలు దొరకక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్రజలతో మాటముచ్చట నిర్వహించారు షర్మిల. నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే.. టీఆర్ఎస్ పార్టీలోకి పోయాడని, ఇక్క పాలకపక్షం కానీ ప్రతిపక్షం గానీ.. ప్రజల వైపు నిలబడి మాట్లాడేవాళ్లే లేరన్నారు షర్మిల.
ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు షర్మిల. ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తే.. సరైన ఉద్యోగాలు లేవని.. నోటిఫికేషన్లు లేవని విమర్శించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల వైపు నిలబడుతుందని, రాజశేఖర్ రెడ్డి పరిపాలన మళ్లీ తెస్తుందని తెలిపారు షర్మిల. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, మహిళలకు రుణాలు అందటంలేదని జనం షర్మిలకు ఏకరువుపెట్టారు.
ఇవి కూడా చదవండి