
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోని దుస్థితి ఇది
- ప్రతిరోజు వందల్లో వచ్చే పేషెంట్లు, గర్భిణులకు తప్పని కష్టాలు
- స్కానింగ్ సౌకర్యం ఉన్నా టెస్ట్ లు చేసే డాక్టర్ లేరు
- ప్రైవేటు సెంటర్లకు వెళ్తుండగా వేలల్లో ఖర్చులు
- డబ్బులు పెట్టుకోలేనివారికి ఎదురుచూపే దిక్కు
- వైద్యులు లేరని బోర్డ్ పెట్టిన ఆస్పత్రి స్టాఫ్
- పట్టించుకోని వైద్యశాఖ ఉన్నతాధికారులు
ఎల్బీనగర్,వెలుగు: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి 150 పడకల పెద్దాస్పత్రి అయినా.. వైద్య సేవలు పొందాలంటే రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎక్కువగా ఈ ఆస్పత్రికే వస్తుంటారు. కొండాపూర్ లో ఇంకో జిల్లా ఆస్పత్రి ఉన్నా అక్కడ రోగుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వనస్థలిపురం ఆస్పత్రిలోనే ట్రీట్ మెంట్ పొందేందుకే పేషెంట్లు, గర్భిణులు ఆసక్తి చూపిస్తుంటారు. రోజుకు 300 ఓపీలు వస్తుంటే.. ఇందులో 80 మంది వరకు గర్భిణులే ఉంటారు. అయితే.. ఆస్పత్రిలో ఒక్క రేడియాలజిస్ట్ కూడా లేరు.
8 మంది గైనకాలజిస్ట్ లకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. రివ్యూలో భాగంగా గర్భిణులు ప్రతి నెల స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా కిడ్నీ స్టోన్ ఉండి.. కడుపులో ఏవైనా గడ్డలు అయిన పేషెంట్లకు ట్రిట్ మెంట్ కన్ఫర్మ్ చేయాలంటే డాక్టర్లు స్కానింగ్ కు రెఫర్ చేస్తారు. కానీ టెస్ట్ లు చేసేందుకు రేడియాలజిస్ట్ లేరు. దీంతో చేసేదేమీలేక బయట ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వేలల్లో ఖర్చు చేస్తున్నారు. అంత ఖర్చు పెట్టుకోలేని వారు ఇబ్బందులు పడుతూనే ఎదురుచూడాల్సిన పరిస్థితి ఆస్పత్రిలో నెలకొంది.
రెండు నెలల కిందటి వరకు రేడియాలజిస్ట్ ఉండగా ట్రాన్స్ ఫర్ అయ్యాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో స్కానింగ్ రూమ్ ను మూసేశారు. రేడియాలజిస్ట్ లేరని.. కొత్త వైద్యులు అందుబాటులోకి రాలేదని బోర్డ్ పెట్టి రూమ్కు తాళం వేశారు. జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులైనా సమస్యపై స్పందించి రేడియాలజిస్ట్ ను, గైనకాలజిస్ట్ లను నియమించాలని పేషెంట్లు, గర్భిణులు కోరుతున్నారు.
ఎవరూ పట్టించుకోవట్లేదు
డాక్టర్ కు చూపించుకునేందుకు మూడు రోజులుగా ఆస్పత్రికి వస్తున్నాను. స్కానింగ్ డాక్టర్ లేరు. కేవలం బోర్డు పెట్టిసి.. పట్టించుకోవడంలేదు. ఆస్పత్రి అధికారులు, స్టాఫ్ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎవరూ పట్టించుకోవడంలేదు.
స్వాతి, గర్భిణి
రిక్వెస్ట్ పెట్టాం
ఆస్పత్రిలో అవసరమైన రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్లు ఖాళీలపై ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. షేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
హరిప్రియ, సూపరిండెంట్ వనస్థలిపురంఏరియా ఆస్పత్రి