న్యూఢిల్లీ: మనదేశ ఆకాశవీధులు మరింత బిజీ కాబోతున్నాయి. ఎయిర్ ఇండియా మాదిరిగానే ఇతర ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున విమానాలు కొనడానికి రెడీ అవుతున్నాయి. ఇండియాలోని ప్రతి ఎయిర్లైన్ కంపెనీ రాబోయే పదేళ్లలోపు కొత్త విమానాలు కొనబోతున్నదని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) తెలిపింది. ఎయిర్ ఇండియా పెద్ద సంఖ్యలో విమానాల కోసం ఇటీవల ఎయిర్బస్, బోయింగ్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇతర ఇండియా విమానయాన సంస్థలు కూడా రెండేళ్లలో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న, టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎయిర్బస్, బోయింగ్ నుండి భారీగా వైడ్-బాడీ, నారో బాడీ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. బోయింగ్ నుండి 220 విమానాలను, ఎయిర్బస్ నుండి 250 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇండియాలోనే దాదాపు ప్రతి క్యారియర్ ఫ్లీట్ రీప్లేస్మెంట్, మార్కెట్ గ్రోత్ కోసం రాబోయే రెండేళ్లలో మరిన్ని ఎయిర్క్రాఫ్ట్లను ఆర్డర్ చేస్తుందని భావిస్తున్నట్లు సీఏపీఏ రిపోర్ట్ తెలిపింది. పాత విమానాలకు బదులు కొత్తవి కొనడం, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త ఆర్డర్లు ఇస్తున్నాయి.
భారీగా విమానాలు కొననున్న ఇండిగో
ఇండిగో సుమారు 300 విమానాలకు ఆర్డర్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది. కరోనా కారణంగా ఇది ఆలస్యమైంది. ఇప్పుడు ఇది 500 విమానాల వరకు కొనే అవకాశాలు ఉన్నాయి. సప్లై చెయిన్ సమస్యల కారణంగా ఇంజన్స్ అందుబాటులో లేవు. 2024 ఆర్థిక సంవత్సరం (2023–-2024) చివరి నాటికి ఇటువంటి సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు పరిష్కారమైన తర్వాత కూడా, ఆర్డర్లు పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. 2022 డిసెంబర్ 31 నాటికి ఎయిర్బస్, బోయింగ్లు కలిపి 12,669 ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది కానీ ఇప్పటికీ సాధ్యం కాలేదు. డెలివరీ స్లాట్ల కోసం కనీసం రెండేళ్ళ వరకు ఆగాలని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
9 ఎంబ్రాయర్ విమానాలను కొననున్న స్కూట్ ఎయిర్లైన్స్
సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ)కు చెందిన అనుబంధ సంస్ధ స్కూట్ తొమ్మిది ఎంబ్రాయర్ 190-ఈ2 ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) చేసుకుంది. మొదటి ఎయిర్ క్రాఫ్ట్ను 2024లో డెలివరీ చేయనున్నారు. మిగిలిన ఎయిర్క్రాఫ్ట్లను 2025 సంవ త్సరం వరకు అందించనున్నారు. బ్రెజిలి యన్ ఎయిర్క్రాఫ్ట్ తయారీదారు ఎంబ్రా యర్ అత్యంత పాపులర్ అయిన ఈ190- ఈ2 మోడల్స్ను సప్లై చేయనుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఒకేసారి 112 మంది ప్రయాణించవచ్చు. ఐదు గంటల లోపు ప్రయాణాలకు ఇవి అనువైనవి. ఆసియాలో ఎయిర్ ట్రావెల్కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా వీటిని ఆర్డర్ చేశామని స్కూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెస్లీ థాంగ్ చెప్పారు.