- బడ్జెట్ సమావేశాల్లోపా..మూఢాలు ముగిసినంకనా..
- మంచిరోజులపై ఆరా తీస్తున్న లీడర్లు
- రేపు టీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో కేసీఆర్
- సంకేతాలు ఇవ్వొచ్చని కేడర్ అంచనా
- లేకపోతే సీఎం కేసీఆర్ పుట్టినరోజున ప్రకటన చేయొచ్చని ప్రచారం
హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడుతారన్న దానిపై టీఆర్ఎస్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ముహూర్తం ఎప్పుడు..? మంచి రోజులున్నాయా..? అని లీడర్లు ఆరా తీస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే సీఎం సీట్లో కేటీఆర్ కూర్చుంటారా? లేక మే నెల చివరలో బాధ్యతలు తీసుకుంటారా..? అనేది హాట్టాపిక్ గా మారింది. ఇదే టైమ్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అధ్యక్ష హోదాలో కేసీఆర్ ఈ మీటింగ్లో ఎలాంటి సంకేతాలు ఇస్తారనేది కేడర్లో ఆసక్తిగా మారింది. లేదా ఈ నెల 17 సీఎం కేసీఆర్ పుట్టినరోజునైనా ప్రకటన ఉండొచ్చని లీడర్లు భావిస్తున్నారు. పైగా రోజురోజుకు ‘కేటీఆర్ సీఎం’ డిమాండ్ పెరుగుతున్నా పార్టీ పెద్దలు వారించే ప్రయత్నం చేయకపోవడంతో కేడర్ కూడా నిర్ణయం జరిగి పోయిందని, ముహూర్తం ప్రకటించడమే తరువాయి అని నమ్ముతున్నారు.
రేపటి మీటింగ్ కీలకం.. ఫుల్ సెక్యూరిటీ!
ఆదివారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. భవన్ వద్ద ఈసారి మరింత ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్టీ కార్యాలయం నుంచి విజ్ఞప్తులువెళ్లినట్లు తెలిసింది. కేటీఆర్ను కలిసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేటీఆర్ను సీఎం చేయాలని వస్తున్న డిమాండ్ పై కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఎలాంటి సంకేతాలు ఇస్తారోనని కేడర్ ఎదురుచూస్తోంది. మీటింగ్కు వస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు.. కేటీఆర్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అధికార మార్పిడి అనే అంశం తెరమీదికి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ ను కలిసేందుకు చాన్స్ దొరకని లీడర్లు కూడా ఇప్పుడు తెలంగాణ భవన్లో ఆయనను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆదివారం మీటింగ్ లో పార్టీ మెంబర్షిప్ రెన్యూవల్, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న జరిగే వార్షిక మహాసభపై చర్చ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.
ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎల్బీ స్డేడియాన్ని బుక్ చేసుకున్నారు. ఆ రోజు స్టేడియంలో యాగాలు, బ్లడ్ క్యాంపులు, అన్నదానం, ఆటల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశాల్లో కాకపోతే.. ఈ బర్త్డే వేడుకల్లోనైనా కేటీఆర్ పట్టాభిషేకంపై కేసీఆర్ ప్రకటన చేయొచ్చని లీడర్లు అభిప్రాయపడుతున్నారు.
నెలరోజుల్లో లేదా.. మేలో..?
కేటీఆర్ను సీఎం చేయడం పక్కా అయితే.. మరి ముహూర్తం ఎప్పుడు? దీనిపై టీఆర్ఎస్ లీడర్లు రకరకాలుగా అంచనాలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే సీఎం సీటును కేటీఆర్కు అప్పగించవచ్చని కొందరు అంటున్నారు. మార్చి ఫస్ట్ లేదా సెకండ్ వీక్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అంటే నెలరోజుల్లో ఎప్పుడైనా కేటీఆర్కు బాధ్యతలు అప్పగించవచ్చని కొందరు అంచనా వేస్తుంటే.. మరో రెండు మూడు నెలలు పట్టొచ్చని ఇంకొందరు చెప్తున్నారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేవని, మే మూడో వారం వరకు మూఢాలు ఉన్నాయని, ఆ తర్వాతే కేటీఆర్కు బాధ్యతలు అప్పగించవచ్చంటున్నారు.
కేటీఆర్ కోసం లీడర్ల క్యూ
మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఏ చిన్న అవకాశం వచ్చినా కేటీఆర్ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వాదిస్తున్నారు. కేటీఆర్ దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అడ్వాన్స్గా అభినందనలు చెప్తున్నారు. ఇంకొందరు.. కేటీఆర్ ఎక్కడున్నాడని ఆయన పీఏ, పీఎస్ లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ప్రగతిభవన్ లోని క్యాంపు ఆఫీసులో ఉంటే అక్కడికి వెళ్తున్నారు. హైదరాబాద్లో అధికారిక ప్రోగ్రామ్లకు వెళ్తే అక్కడికీ పరుగులు తీస్తున్నారు. దీంతో లీడర్ల తాకిడి పెరిగిందని గ్రహించిన కేటీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్న వారిని మాత్రమే కలుస్తున్నట్టు టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ మధ్య కేటీఆర్ ఓ ప్రైవేటు పనిమీద బెంగుళూరుకు వెళ్తే కొందరు లీడర్లు అక్కడికి వెళ్లి కూడా కలిసినట్టు చెప్తున్నారు