మూకుమ్మడిగా రాజీనామాలకు పది మంది ఎమ్మెల్యేలు రెడీ

మూకుమ్మడిగా రాజీనామాలకు పది మంది ఎమ్మెల్యేలు రెడీ

బీజేపీ పార్టీతో 10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. దీనికి టీఆర్ఎస్ నాయకులే కారణమవుతారన్నారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలో మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మిస్తాయన్నారు. పది మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారని, టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి అనేక మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీ చాలా సందర్భాల్లో మోడీ పథకాలను ప్రశంసించారన్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ మూడు రోజులు ఉండి ఏం చేశారన్ని ప్రశ్నించారు. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని జిట్టా బాలకృష్ణా రెడ్డి ఫామ్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.

అప్పటి వరకు ప్రజా సంగ్రామ యాత్ర...
ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని, మధ్యలో ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని.. వాటినే మేనిఫెస్టో లో పెడతామన్నారు. ఉదోగాలు, ఫించన్ లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్ల విషయాలను ప్రజలు ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా టీఆర్ఎస్ నాయకుల వేధింపులను తమ దృష్టికి తెస్తున్నట్లు వెల్లడించారు. కొంత మంది రాజకీయ నాయకులు జోకర్లుగా వ్యవహరిస్తున్నట్లు, వారు కూడబెట్టిన ఆస్తులు ఇతరుల దృష్టి పడకుండా జాగ్రత్త పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారని ప్రశ్నించారు. 8 వేల ఇళ్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ లో వెల్లడించారని తెలిపారు. పేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మాణం చేస్తామని హామీనిచ్చారు. క్యాసినో స్కామ్ లో చాలా మంది టీఆర్ఎస్ నాయకులున్నారని ఆరోపించారు.

క్యాసినో, డ్రగ్స్ స్కామ్ లు...
క్యాసినో, డ్రగ్స్ స్కామ్ లలో వారే ఉన్నట్లు, నయీమ్ డైరీతో పాటు డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి ఇబ్బంది రాగానే నయీంని ఎన్ కౌంటర్ చేశారన్నారు. నయీం బాధితులను ఆదుకోవడమే కాకుండా వారికి న్యాయం చేస్తామని, డబ్బులు రికవరీ చేసిస్తామని తెలిపారు. చేనేత బంధు పథకం ఏర్పాటు చేసే విషయంలో పార్టీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఆస్తులను లీజుల పేరుతో వ్యాపారం చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు.. ప్రైవేట్ పరం చేయటానికి చూస్తున్నారని తెలిపారు. ఆర్టీసీనీ బీజేపీ పరిరక్షిస్తుందన్నారు. ఆయిష్మాన్ భారత్ లో జర్నలిస్ట్ లను చేర్చే విషయం చర్చిస్తామని, వారికి రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.

టికెట్ల విషయంలో గ్యారంటీ ఇవ్వలేము...
ఇక పార్టీలో అందరికి సముచిత గౌరవం ఉంటుందని, టికెట్ల విషయంలో గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. టికెట్ల అంశం జేపీ నడ్డా అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు చూసుకుంటుందన్నారు. 61అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఎడ్జ్ ఉందని స్పష్టమైనట్లు, బీజేపీ ఓట్ షేర్ 41 నుంచి 53 శాతానికి పెరిగిందన్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం పని చేసే వారికి పార్టీలో స్థానం ఉండదని కుండబద్దలు కొట్టారు. టీఆర్ఎస్ ను ప్రజలు ప్రశ్నించటం ప్రారంభించినట్లు, కాంగ్రెస్ నేతలకు అంతర్గతంగా విభేదాలు ఎక్కువన్నారు.