
- రోడ్డు పొడవు అంతే..వెడల్పు మాత్రమే పెరుగుతున్నది
- 4 లేన్ల నుంచి 6 లేన్ల రోడ్డుగా మార్పు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
- జనవరి నుంచి వర్క్ స్టార్ట్ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధం
- 90 శాతం భూసేకరణ కంప్లీట్.. బీఆర్ఎస్ హయాంలో కేవలం 6 శాతమే
- రాష్ట్ర వాటా నిధుల కోసం రూ.3 వేల కోట్ల హడ్కో రుణం తీసుకున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నార్త్ పార్ట్ను 161.5 కిలో మీటర్ల దూరం ఎలాంటి అలైన్మెంట్ మార్చకుండానే పనులు చేపట్టడానికి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అలైన్మెంట్ మార్చుతారంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. ఒక్క కిలో మీటర్ దూరం కూడా రోడ్డు పొడవు పెంచబోమని ప్రకటించింది. కాగా, 4 లేన్ల నుంచి 6 లేన్ల రోడ్డుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నార్త్ పార్ట్ పనులకు డిసెంబర్లోపు టెండర్లు కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది జనవరిలో వర్క్స్ స్టార్ట్ చేయడానికి రాష్ట్ర సర్కారు ప్లాన్ సిద్ధం చేసుకున్నది. నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర వాటా కింద రూ.3 వేల కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకొని, ఖర్చు చేస్తున్నది.
రూ.6 వేల కోట్లతో 90 శాతం భూసేకరణ కంప్లీట్
ట్రిపుల్ఆర్ నిర్మాణానికి కేంద్రం నుంచి 2017–18 లో అన్ని అనుమతులు వచ్చాయి. నార్త్, సౌత్ పార్ట్లుగా విభజించి పనులు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఫస్ట్ సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్ వయా భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518 కిలో మీటర్ల నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని భావించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇందులో 72.25 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. గత కేసీఆర్ సర్కారు ఐదేండ్లలో కేవలం 6 శాతం భూసేకరణ మాత్రమే చేపట్టింది. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 4 వరుసలుగా ఉన్న ఈ రోడ్డును 6 లేన్లుగా మార్చింది. దీంతోపాటు రైతులను ఒప్పించి రూ.6 వేల కోట్లతో కేవలం రెండేండ్లలో 90 శాతానికిపైగా భూసేకరణ కంప్లీట్ చేసింది. దీనికోసం రాష్ట్ర వాటాగా రూ.3 వేల కోట్ల నిధులను హడ్కో నుంచి రుణంగా తీసుకొని, ఖర్చుచేస్తున్నది.
తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట!
ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ నిర్మాణం విషయంలో అలైన్మెంట్ మార్చుతున్నారని.. పెద్దల భూములను కాపాడుతూ పేద రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. ‘‘ఒక్క కిలో మీటర్ కూడా అలైన్మెంట్ మార్చడం లేదు. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మాణ పనులను స్టార్ట్ చేస్తాం’’ అని శనివారం స్వయంగా ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రకటన చేశారు. అదంతా బీఆర్ఎస్ లీడర్ల గోబెల్స్ ప్రచారం అని మండిపడ్డారు. దీనిని రైతులు నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు. దీంతో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడినట్లయ్యింది.