యాడున్నరో.!TRSలో తెరమరుగైన హేమాహేమీలు

యాడున్నరో.!TRSలో తెరమరుగైన హేమాహేమీలు
  • ఫస్ట్​ టర్మ్​ పాలనలో పార్టీకి, ప్రభుత్వానికి వారే వెన్నుదన్ను.. ఇప్పుడు జాడే కరువు

హైదరాబాద్, వెలుగు: వాళ్లంతా టీఆర్ఎస్​ తొలి సర్కార్​లో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ కార్యక్రమాలైనా.. మీడియా సమావేశాలైనా.. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇవ్వడంలోనైనా వారే ముందు వరుసలో ఉండేవారు. ఇటు పార్టీలో.. అటు ప్రభుత్వంలో మంచి పొజిషన్​లో ఉంటూ  పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేవారు. కానీ.. ఇప్పుడు వాళ్లు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. వారిలో కొందరైతే ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి. కేకే మొదలు.. నాయిని నర్సింహారెడ్డి, హరీశ్​రావు, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, స్వామిగౌడ్​ఇలా చాలా మంది టీఆర్​ఎస్​ హేమాహేమీలు ఇప్పుడు ఇటు పార్టీ కార్యక్రమాల్లో గానీ..  అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ తెరముందుకు రావడం లేదు. వీరిలో కొందరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా.. మరి కొందరు రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచినవాళ్లూ ఉన్నారు. ఫస్ట్​ టర్మ్​ పాలనలో కీలకంగా వ్యవహరించిన ఈ నేతలంతా సెకండ్​ టర్మ్​ పాలనలో గప్​చుప్​ కావడంపై టీఆర్​ఎస్​ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానాలు ఇచ్చేవారే పార్టీలో లేకుండాపోయారని కేడర్​తో పాటు కొందరు లీడర్లు కూడా అనుకుంటున్నారు. ఆ నేతలు ఎక్కడికిపోయారని, వాళ్లు యాక్టివ్​గా ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నర్సన్న జాడేది?

ఉద్యమ కాలం నుంచి టీఆర్​ఎస్​లో కేసీఆర్​ మొదలుకుని అందరూ నాయిని నర్సింహారెడ్డిని ‘నర్సన్న’ అంటూ గౌరవంగా పిలిచేవారు. అలాంటి నర్సన్న ఇప్పుడు ఏడున్నడో అని పార్టీ కేడరే దిక్కులు చూడాల్సి వస్తోంది.  టీఆర్​ఎస్​ తొలి ప్రభుత్వంలో హోం మంత్రిగా నాయిని పనిచేశారు. అప్పట్లో పార్టీ ప్రతి కార్యక్రమానికి ఆయన తప్పకుండా హాజరయ్యేవారు. ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తే వెంటనే ప్రెస్​మీట్ పెట్టి కౌంటర్​ ఇచ్చేవారు.  తాను ఏ జిల్లాల్లో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా మీడియాను పిలుచుకుని స్పందించేవారు. కానీ ఇప్పుడు ఆయన గొంతు వినిపించడం లేదు.

కేసీఆర్ పక్కన.. కేకే ఎక్కడ?

టీఆర్​ఎస్​ తొలి సర్కార్​లో ఎప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్​ పక్కన ఉండే రాజ్యసభసభ్యుడు కె.కేశవరావు జాడ ఇప్పుడు ఎక్కడా లేదు. అప్పట్లో ఏదైనా జాతీయస్థాయి అంశాలు వచ్చినప్పుడు ఆయన పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేవారు. పార్టీ శ్రేణులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. వేదిక మీద  కేసీఆర్ పక్కన కేకే ఉంటే పెద్దమనిషి తరహాగా ఉంటుందని పార్టీ వర్గాలు అంటుండేవి. సీఎం తన ప్రసంగాల్లో కూడా కేకే రాజకీయ అనుభవాలను ప్రస్తావించేవారు. అలాంటి కేకే ఇప్పుడు పార్టీలో యాక్టివ్​ రోల్​లో లేకపోవడంపై టీఆర్​ఎస్​ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన హాజరు కూడా చాలా తక్కువగా ఉంటోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సీఎం నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌‌కు మాత్రం కేకే హాజరయ్యారు. చాలా రోజుల నుంచి అపాయింట్మెంట్​ కోసం నాయిని ప్రయత్నిస్తున్నారని చెప్తున్నాయి. రెండురోజుల క్రితం పార్టీ సభ్యత్వ నమోదుపై టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​  తెలంగాణ భవన్ లో సమీక్ష చేస్తున్నారన్న విషయం తెలుసుకుని ఆయన అక్కడికి వెళ్లారు. అపాయింట్మెంట్​ విషయమై మాట్లాడేందుకే నాయిని తెలంగాణ భవన్​కు వచ్చారని ఓ టీఆర్​ఎస్​ నేత తెలిపారు.

సెగ్మెంట్​కే  హరీశ్​ పరిమితం

టీఆర్​ఎస్​లో ట్రబుల్ షూటర్ గా పేరున్న  హరీశ్​రావు పాత్ర ఫస్ట్​ టర్మ్​ పాలనలో చాలా కీలకంగా ఉండేది. పార్టీలో ప్రభుత్వంలో ప్రత్యేక పోత్ర పోషించేవారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఏమైనా విమర్శలు చేస్తే ఆయన మీడియా ముందుకు వచ్చి గట్టి కౌంటర్ ఇచ్చేవారు. ఇక అసెంబ్లీలో సీఎం తర్వాత  హరీశ్​ ఎక్కువగా ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ అపోజిషన్‌‌‌‌ను ఇరుకున పెట్టేవారు. ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను తరచూ తనిఖీ చేసేవారు. కొన్ని సార్లు రాత్రుళ్లు కూడా అక్కడే ఉండి పనులను పర్యవేక్షించేవారు. ఇంతగా పేరు సంపాదించుకున్న హరీశ్​రావుకు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదు. ఈ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు పార్టీ తరఫున సరైన సమాధానాలు చెప్పేవారు కరువయ్యారని, హరీశ్​ యాక్టివ్​గా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని టీఆర్​ఎస్​కు చెందిన ఓ సీనియర్​ నేత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హరీశ్​రావు తన సొంత నియోజక వర్గం సిద్దిపేటకే పరిమితమయ్యారు. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. ఇంట్లో కార్యం ఉందని గ్రామ స్థాయి లీడర్ ఆహ్వానించినా వెళ్తున్నారు. కానీ హైదరాబాద్‌‌‌‌లో మాత్రం ఆయన పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల సీఎం కేసీఆర్ తన సొంతూరు చింతమడక కు వచ్చినప్పుడు మాత్రమే హరీశ్​ స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఆ  కార్యక్రమానికి వెళ్లారు. అంతకుముందు కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియెట్​ శంకుస్థాపనలో అలా కనిపించి వెళ్లిపోయారు. అవి తప్ప హరీశ్​ పెద్దగా ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ కనిపించడం లేదు. చివరికి తానే దగ్గరుండి పనులు చేయించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఆయన లేకపోవడంపై పెద్ద చర్చే జరిగింది.

తొలి సభల పెద్దలు.. ఇప్పుడు పడిగాపులు

రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ గా మధుసూదనాచారి, కౌన్సిల్​ తొలి చైర్మన్ గా స్వామిగౌడ్​ పాత్రను ఇప్పటికీ టీఆర్​ఎస్​ వర్గాలు గుర్తుచేసుకుంటుంటాయి. వారిద్దరూ కూడా వారి వారి సభల్లో యాక్టివ్​​గా పనిచేశారని పేరుంది.  డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదనాచారి ఓడిపోయారు. అటు తర్వాత ఆయన జాడే లేకుండాపోయింది. కొన్నాళ్ల నుంచి సీఎంను కలిసేందుకు మధుసూదనాచారి తీవ్రంగా ప్రయత్నించగా ఇటీవలే ఆ అవకాశం దక్కిందని  టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. కొన్నిరోజుల కిందట పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటికి సీఎం వచ్చినప్పుడు మధుసూదనాచారి వెళ్లి కలిసొచ్చారు. పంద్రాగస్టు రోజున గోల్కొండ కోటలో జరిగిన వేడుకలకు సీఎంతో పాటు ఆయన హాజరయ్యారు. ఇక కౌన్సిల్​ మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కు విచిత్ర పరిస్థితి ఎదురవుతోందని ఆయన సన్నిహితులు అంటున్నారు. సీఎంను కలిసేందుకు ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. హైదరాబాద్​లోనే  నివాసం ఉంటున్న స్వామిగౌడ్ కు స్థానికంగా జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడం లేదని అంటున్నారు.

ఖమ్మం దాటని తుమ్మల

సీఎం కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు స్థానం నుంచి ఓడిపోయినప్పటి నుంచి ఖమ్మం జిల్లాకే పరిమితమయ్యారు. ఒక్కసారి మాత్రం వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ తో సీఎంను కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమికి గల కారణాలు వివరించారు. అటు తర్వాత ఆయన సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటున్నట్లు స్థానిక నేతలు అంటున్నారు. జిల్లాకు ఎవరైనా మంత్రులు వస్తే అటువైపు ఆయన వెళ్లడం లేదని, వాళ్లు కూడా తుమ్మలను కలిసేందుకు అంతగా ఉత్సాహం చూపడం లేదని వారు చెబుతున్నారు. అప్పట్లో ప్రతిపక్షాల విమర్శలను తుమ్మల దీటుగా ఎదుర్కునేవారని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం చాలా కృషి చేశారని పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు.

నాడు డిప్యూటీలు.. నేడు?

టీఆర్​ఎస్​ తొలి సర్కారులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టేవారు. దళితుల అంశాలపైనా ప్రతిపక్షాలను ఇరుకునపెట్టేవారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. విద్యా శాఖ మంత్రిగా కూడా ఆయన మంచి సేవలు అందించారంటున్నారు. అదే జిల్లాకు చెందిన మరో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా దళిత అంశాలపై కేసీఆర్ తరఫున గట్టిగా మాట్లాడేవారు. వారిద్దరూ ఇప్పటి సర్కార్​లో, పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కడియం తన జిల్లా వరంగల్ కే పరిమితమయ్యారు. అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు.