నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు.. ఎన్నికల్లో పోటీ చేయకూడదనే రూల్ ఏం లేదని, అలాంటి నిబంధనలేవీ రాజ్యాంగంలో లేవని భోపాల్ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు.
మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞాసింగ్ నిందితురాలని, ఆమె నామినేషన్ను రిజెక్ట్ చేయాలంటూ ఎన్ఐఏ న్యాయస్థానంలో మాలెగావ్ కు చెందిన అహ్మద్సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి ఆమెపై పిటిషన్ దాఖలు చేశారు. అయితే తనకు ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు క్లీన్చిట్ ఇచ్చిందని, ఆ పేలుళ్ల విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆమె న్యాయస్థానానికి తెలియజేశారు. ఒక వ్యక్తిపై క్రిమినల్ కేసు ఏదైనా ఉంటే ఆ విషయాన్ని నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అఫిడవిట్లో పేర్కొనాలని, తాను అలానే చేసినట్లు ఆమె తెలిపారు. (మాలెగావ్ పేలుళ్లలో అహ్మద్సయ్యద్ బిలాల్ కుమారుడు సయ్యద్ అజహర్ మరణించాడు.)