గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు రావొద్దు

గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు రావొద్దు
  •     క్షేత్రస్థాయి పర్యటనల్లో కలెక్టర్లు
  •     నీటి వనరులను పరిశీలించి, అధికారులకు సూచనలు

ఉట్నూర్​, వెలుగు: ఎండాకాలంలో గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని కలెక్టర్​ రాజన్షి షా అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ఉట్నూర్​, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించారు. బుర్సాన్ పటార్, రాంజీ గూడ ఉట్నూర్ మండలంలోని ఉమ్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్​ను పరిశీలించారు. అనంతరం రాంజీ గూడలోని బావి దగ్గరకు వెళ్లారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడారు.

గత కొంత కాలంగా ఆ బావి నీటిని వ్యవసాయానికి తప్ప తాగేందుకు వాడటం లేదని స్థానికులు తెలిపారు. స్పెషల్ డెవలప్ ఫండ్ కింద మంజూరైన రూ. ఐదు లక్షలతో రాంజీ గూడ బావి నుంచి బూర్షన్ పటార్ వరకు పైప్ లైన్ పనులు ప్రారంభించి తాగు నీరు అందించాలని చెప్పారు. అలాగే ఆదర్శ పాఠశాల మౌలిక వసతుల కోసం ఇంతకు ముందే మంజూరైన రూ. 3.60 లక్షల తాగునీరు, తరగతి గదులు, మరుగుదోడ్లు, విద్యుత్​ మరమతులు జూన్ 10 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చూడాలని ఉమ్రీలో మిషన్ భగీరథ నీరు రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుందని, ఆ నీరు సరిపోవడం లేదని స్థానికులు కలెక్టర్​ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో టాంకర్లతో నీటిని సరఫరా చేయాలని కలెక్టర్​ అధికారులకు చెప్పారు. 

నస్పూర్ : మంచిర్యాల జిల్లాలో వేసవికాలం పూర్తి అయ్యేవరకు ప్రజలందరికీ సరిపడా తాగునీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం హాజీపూర్ మండలంలో ని ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ ను మిషన్ భగీరథ ఈఈ మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సెగ్మెంట్ పరిధిలో వేసవికాలం పూర్తయ్యే వరకు నిరంతర తాగునీటి సరఫరాకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

మిషన్​ భగీరథ నీటిని గ్రామాలకు ఎప్పుడూ అందించాలని, పైప్​లైన్ లీకేజీలు, ట్యాంకుల రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్​ భగీరథ పథకం కింద జిల్లాలో నీటి సరఫరాపై ప్రతి రోజు నివేదిక అందించాలని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని 6 మున్సిపాలిటీలకు నీటి తరలింపుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, వేసవి ఉష్టోగ్రత అధికం అవుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చే మూడు నెలలు ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.