
- అమెరికా ఎంపీలు, నిపుణుల ఆందోళన
- హెచ్1బీ వీసా ఫీజు పెంపు చాలా క్రూరమని ఫైర్
న్యూయార్క్: అమెరికాలోకి వలస కట్టడి చేసేందుకు హెచ్ 1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా మంది అమెరికా ఎంపీలు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని, చాలా క్రూరమని మండిపడుతున్నారు. హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికాకే ఎక్కువ నష్టమని, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
‘‘చాలా మంది హై స్కిల్డ్ వర్కర్లతో మన వర్క్ ఫోర్స్ బలంగా తయారైంది. కొన్ని వేల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను నిర్మించడంలో హెచ్ 1బీ వీసా హోల్డర్లు కీలకపాత్ర పోషించారు. వారిలో చాలా మంది చివరకు అమెరికా పౌరులుగా మారి ఇక్కడే మంచి జీతాలిచ్చే ఉద్యోగాలు సృష్టిస్తారు” అని ఎంపీ రాజా కృష్ణమూర్తి తెలిపారు. చాలా దేశాలు గ్లోబల్ ట్యాలెంట్ ను ఆకర్షిస్తున్నాయని, అమెరికా కూడా తన మానవ వనరులను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు.
కెనడా, యూరప్కు లబ్ధి
హెచ్ 1బీ ప్రోగ్రాంతో ప్రపంచం నలుమూలల నుంచి టాప్ ట్యాలెంట్ ఉన్నవారు అమెరికాకు వచ్చారని, ఇప్పుడు దాని ఫీజు పెంచితే అలాంటి టాలెంట్ రావడం ఆగిపోతుందని ఏషియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్, మాజీ ప్రెసిడెంట్ బైడెన్ మాజీ సలహాదారు అజయ్ భుతోరియా అన్నారు.
తాజా నిర్ణయంతో అమెరికాలో చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు చితికిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దేశ ఎకానమీ అభివృద్ధికి దోహదం చేసిన స్కిల్డ్ ప్రొఫెషనల్స్ను కూడా ట్రంప్ నిర్ణయం అమెరికా నుంచి వెళ్లగొడుతుందన్నారు. ‘‘ట్రంప్ నిర్ణయం బెడిసి కొడుతుంది. ఆయన నిర్ణయంతో మన పోటీదారులు కెనడా, యూరోప్కు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వెళ్లిపోతారు” అని అజయ్ పేర్కొన్నారు.
బిజినెస్లో అనిశ్చితి ఏర్పడుతుంది: నాస్కామ్
హెచ్1బీ వీసాల ఫీజు పెంపు నిర్ణయంతో ఇండియన్ ఐటీ కంపెనీలపై ప్రభావం పడుతుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్
కంపెనీస్ (నాస్కామ్) ఆందోళన వ్యక్తం చేసింది.