
ప్రీ ఫిజిబులిటీ స్టడీ ఫీజు కోసం ఎయిర్పోర్టు అథారిటీకి రూ.40.53 లక్షలు చెల్లింపు
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. అంతర్గాం మండల కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం 591 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎయిర్ పోర్టు నిర్మాణం సాధ్యమవుతుందా అనే విషయమై ప్రీ ఫిజిబులిటీ స్టడీ చేసేందుకు రూ.40.53 లక్షల ఫీజును ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ఛీప్ సెక్రటరీ వికాస్ రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో పాలకుర్తి మండలం బసంత్నగర్ వద్ద ఉన్న స్థలంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు సాధ్యంకాదని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు స్టడీ చేసి తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు వచ్చి స్టడీ చేసిన తర్వాత ఇచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
ఎయిర్పోర్టు ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదు
రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పెద్దపల్లి జిల్లా ప్రజలకు అంతర్గాం ఎయిర్పోర్టు వల్ల ఉపయోగం ఉంటుంది. హైదరాబాద్కు రోడ్డు మార్గంలో గంటలకొద్దీ ప్రయాణం చేయకుండా ఎయిర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంతర్గాంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రీ ఫిజిబులిటీ స్టడీ కోసం రూ.40.53 లక్షల ఫీజు చెల్లించడం చారిత్రాత్మక ముందడుగు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నా. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో పెద్దపల్లి ప్రజలు ఇచ్చిన మద్దతుతో అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటయ్యే వరకు కృషి చేస్తా.
- గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ