
చైనాలో మరోసారి కరోనా కోరలు చాస్తోందా..? మళ్లీ ముప్పు తప్పదా..? అంటే అవుననే అంటున్నారు కొందరు అధికారులు. రాబోయే మూడు నెలల్లో 60 శాతం జనాభా వైరస్ బారిన పడనున్నట్టు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చైనా దేశంలో కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తుండగా.. ప్రజలు ఆందోళనలు చేయడంతో ఈ మధ్యే నిబంధనలను సడలించారు. ఆ తర్వాత నుంచే కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చైనాలోని అన్ని ఆస్పత్రుల్లోనూ పేషెంట్లతో కిక్కిరిసిపోయానని చెబుతున్నారు. ఎమర్జెన్సీ వార్డుల్లోనూ బెడ్లు సరిగా లేక కొంత మందిని కిందే పడుకోబెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అక్కడి పరిస్థితిపై అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక దహనవాటికకు రోజుకు 30 నుంచి 40 శవాలు మాత్రమే వచ్చేవని, ఇప్పుడు జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేశాక రోజుకు దాదాపు 200 వరకూ శవాలు వస్తున్నాయని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీంతో వారికి పని ఒత్తిడి బాగా పెరిగిపోయిందని వాపోతున్నారు. అయితే.. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే 3 నెలల్లో చైనాలోని 60శాతం వైరస్ బారిన పడడం ఖాయమని ఎరిక్ ఫెయిగిల్ డింగ్ అనే టాప్ ఎపిడమాలజిస్ట్ చెబుతున్నారు. జీరో కోవిడ్ ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేయడంతో చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.