భోగిమంట ఎందుకంటే..

భోగిమంట ఎందుకంటే..

తెలుగిళ్లలో సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగల్లో ఒకటి ‘భోగి’. మూడు రోజులపాటు సాగే సంక్రాంతి వేడుకల్లో మొదటిది భోగి. సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే ఈ పండుగకు మన సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రోజు (మంగళవారం) భోగి సందర్భంగా ఈ పండుగ విశేషాలు..

దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు భోగి. ఇళ్లలోకి భోగభాగ్యాలను ఆహ్వానించే రోజు ఇది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఇంటికిచేరే రోజు. రైతులతోపాటు అందరి ముఖాల్లో నవ్వులు పూసే రోజు. భోగి అంటే ‘తొలినాడు’ అని ఒక అర్థం ఉంది. కొత్త సంవత్సరంలో పండుగలు భోగితోనే మొదలవుతాయి. ఈ రోజున ఇంటి ముందు భోగి మంట వేస్తే ఇంట్లోని చెడు, దరిద్రాన్ని తొలగించుకున్నట్లే అని నమ్మకం.

పురాణాల ప్రకారం

భోగి పండుగ వెనుక కొన్ని పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ధనుర్మాసం చివరి రోజు. ఈ నెలంతా విష్ణుమూర్తి దేవాలయాల్లో ధనుర్మాసోత్సవాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. దీనికీ, భోగి పండుగకు సంబంధం ఉంది. విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి. ఆమెకు వివాహం చేయాలనుకుంటాడు విష్ణుచిత్తుడు. అయితే తాను శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాయకులను తప్ప మరెవరినీ వివాహం చేసుకోనని తండ్రితో చెప్పింది. ఈ కోరిక తీరడం కోసం ధనుర్మాస వ్రతం చేసి, నెల రోజులపాటు పొంగలి మాత్రమే ఆహారంగా తీసుకుందట. అదే సమయంలో రచించిన కృతులను స్వామికి అర్పించింది. వ్రతం పూర్తవగానే స్వామి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని శ్రీరంగం రమ్మని ఆదేశిస్తాడు. ఆమెకు సమస్త భోగాలను సమకూరుస్తానని వరం ఇస్తాడు. విష్ణుచిత్తుడు ప్రజలందరి సమక్షంలో వారి వివాహం జరిపిస్తాడు. వివాహం పూర్తికాగానే గోదాదేవి గర్భాలయంలోకి వెళ్లి, స్వామివారి పక్కన కూర్చొని, స్వామివారిలో ఐక్యమవుతుంది. ఈ తంతు జరిగిన రోజు భోగి. గోదాదేవిలాగే అందరికీ భోగభాగ్యాలు ఇచ్చే రోజు కాబట్టి ఇది భోగి పండుగ అయ్యిందని ఒక కథ ప్రచారంలో ఉంది.

లౌకిక రూపం

పురాణాల నుంచి పుట్టిన పండుగలైనప్పటికీ, వాటికి ఒక సైంటిఫిక్​ కోణం ఉండటం మన కల్చర్​ గొప్పదనం. ప్రతి పౌరాణిక పండుగ ఒక లౌకిక రూపం సంతరించుకుంటూ, అందరికీ ఆనందకరమైన రోజుగా మారుతుంది. అంటే ప్రజలందరూ జరుపుకునే సంప్రదాయాలు పండుగలో చేరుతుంటాయి. అలా వచ్చినవే భోగి పండుగ రోజు మంటలు వేయడం, చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం. భోగి పండుగ రోజు సూర్యోదయానికి ముందే ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారు. ఆవు పేడతో చేసిన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల నుంచి వచ్చిన కలప, తాటాకులు, పంటలు కోసిన తర్వాత వచ్చిన గడ్డి వంటివి వేసి భోగి మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువుల్ని కూడా మంటల్లో వేస్తుంటారు. దీనివల్ల ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు తొలగిపోతాయి. ఇంట్లో అవసరంలేని వస్తువుల్ని బయటపడేసినట్లుగానే, మనలో పనికిరాని చెడు ఆలోచనల్ని, బాధల్ని కూడా ఇలాగే చేయాలని దీనిలోని అంతరార్థం.

నలుగు స్నానం

భోగి రోజు ఆచరించాల్సిన మరో సంప్రదాయం నలుగుస్నానం. భోగి మంటలు అయిపోగానే, ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్ధన చేసుకోవాలి. తర్వాత కుంకుడు కాయ రసంతో స్నానం చేయాలి. రసాయనాలు వాడకుండా సహజసిద్ధ పదార్థాలతో స్నానం చేస్తే ఒంటిపై ఉన్న మలినాలన్ని తొలగిపోతాయి. శరీరం కొత్త తేజస్సును, శక్తిని పొందుతుంది.

భోగి పళ్లు

చాలా మందికి భోగి అనగానే గుర్తొచ్చేది భోగి పళ్లు. పన్నెండేళ్లలోపు పిల్లల తలపై నుంచి పండ్లు పోయడం ఈ సంప్రదాయం. రేగి పండ్లు, జీడిపండ్లు, చెరుకు ముక్కలు, కొన్ని నాణేలు పిల్లల తలపై నుంచి పోస్తారు. చాప లేదా దుప్పటిపై, తూర్పు అభిముఖంగా కూర్చోబెట్టి ఇలా చేయాలి. రేగి పండ్లను శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. వీటిని తలపై పోస్తే శ్రీ లక్ష్మీ నారాయణుల ఆశీస్సులు పిల్లలకు ఉంటాయని నమ్మకం. పురాణాల ప్రకారం శివుడికోసం

నరనారాయణుల బదరికావనంలో తపస్సు చేస్తారు. అప్పుడు దేవతలు వాళ్ల తపస్సుకు మెచ్చి, నరనారాయణుల తలలపై బదరీ ఫలాలు కురిపించారని చెప్తారు. అందుకే, ఈ కార్యక్రమం పురాణకాలం నుంచి వస్తున్న ఆచారమని ఎక్కువమంది నమ్ముతారు. 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు మాత్రమే, అంటే యుక్త వయసులోకి రాని పిల్లలకు మాత్రమే ఇలా భోగిపండ్లు పోస్తారు.

బొమ్మల కొలువు

కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు. సాయంత్రం పూట పిల్లలు తమ ఇంట్లోని బొమ్మలన్నింటినీ ఒక చోట పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొన్ని నీళ్లు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయ్యాక మరో పంట కోసం నీళ్లు పారించడాన్ని పులకేయడం అంటారు. అంటే ఇది ‘భోగి పులక’ అని అర్థం.

పులగం

ఈ రోజు ప్రత్యేకంగా ‘పులగం’ అనే వంటకం చేసుకుంటారు. ఇది ఆరోగ్యపరంగానూ మేలైనది. చలి నుంచి ఒంటిని రక్షించి వెచ్చదనాన్ని అందించే లక్షణం ఈ వంటలో ఉంది. పైగా జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అందుకే చాలా మంది భోగి రోజు పులగం తప్పనిసరిగా తినాలి. మనం తరచుగా వాడే కలగా పులగం అనే మాట దీని నుంచే వచ్చింది. భోగి రోజు లక్ష్మీదేవిని కూడా కొలుస్తారు. ధాన్యలక్ష్మికి కట్టు పొంగలి చేసి నైవేద్యం గా పెడతారు. రాగులు, జొన్నలు పండే ప్రాంతాల్లో వాటితో ప్రత్యేకంగా రొట్టెలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. భోగిరోజు పెళ్లికాని అమ్మాయిలు పాలతో పొంగలి చేసి లక్ష్మిదేవికి ప్రసాదంగా పెడితే వివాహం అవుతుందని నమ్ముతారు.