ఒక్క రోజు స్నానం చేయకపోతే ఆ రోజు మొత్తం ఏదోలా ఉంటుంది. అదీ రెండు రోజులైతే.. ఇంకా చిరాకొస్తుంది. కొంచెం కష్టమైనా... కొద్ది రోజులు స్నానం చేయకుండా ఇష్టపడతామేమో. కానీ 22 ఏళ్లుగా స్నానం చేయకుండానే జీవిస్తు్న్నాడు. అయినా కూడా ఎలాంటి అనారోగ్యం గానీ, అతని శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన గానీ రాకపోవడం చెప్పుకోదగిన విషయం.
బిహార్ లోని పాల్గంజ్ జిల్లా, బైకుంఠపుర్కు చెందిన 62 ఏళ్ల ధరమ్దేవ్ రామ్.. 2000 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. అయినా అతని శరీరం నుంచి దుర్వాసన లేదు. ఎప్పుడూ అనారోగ్యబారిన పడలేదు. దీని వెనకాల బలమైన కారణమే ఉంది. అదేంటంటే.. మహిళలపై పెరుగుతున్న నేరాలు, భూ వివాదాలు, జంతు వధలే కారణమట. అవన్నీ నిషేధించే వరకు తాను స్నానం చేయనని ప్రతిజ్ఞ చేశాడట. ఇది నిన్నో, మొన్నో చేసిన వాగ్దానం కాదు. ధరమ్దేవ్ రామ్ కు 44ఏళ్లు ఉన్నప్పటి మాట. అంటే ఇప్పటికి 22 ఏళ్లు అవుతుంది. అప్పట్నుంచి ఆయన అలా స్నానం చేయకుండానే ఉన్నాడని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.
2003లో ధర్మదేవ్ భార్య మాయ చనిపోయినా, ఆ తర్వాత అతని ఇద్దరి కొడుకులు మరణించినా కనీసం ఒక్క నీటి బొట్టు కూడా తన శరీరంపై పడనివ్వలేదట. ఇది చూసిన కొందరు గ్రామస్థులు అతను మంత్ర- తంత్రాలు వస్తాయని అనుకుంటే, మరికొందరేమో అతనికి ఏదైనా మానసిక వ్యాధి ఉందేమో.. అందుకే ఇలా చేస్తున్నాడని అనుకుంటున్నారట.
ధరమ్దేవ్ రామ్”1975లో బెంగాల్ లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. 1978లో వివాహం జరిగింది. 1987లో భూ తగాదాలు, జంతు వధలు, మహిళలపై నేరాలు పెరగడంపై తనకు అవగాహన వచ్చిందని ధరమ్దేవ్ తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఓ గురువుని ఆశ్రయించానని ధరమ్దేవ్ చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లానని ఆయన తనకు సూచించారన్నారు. అందుకే అప్పటి నుంచి భక్కి మార్గంలోనే వెళుతూ... ధర్మదేవుడు శ్రీరాముడిని ఆదర్శంగా భావిస్తున్నానని తెలిపారు. 22 ఏళ్ల నుంచి నుంచి స్నానం చేయకపోయినా ఆరోగ్యంగానే ఉన్నానని ధరమ్దేవ్ స్పష్టం చేశారు.
ఇక ఇదే తరహాలో ఇదే రాష్ట్రంలోని సారణ్ జిల్లాకు చెందిన సంత్ జై శ్రీరామ్ దాస్... గత 12ఏళ్ల నుంచి అన్నంకు బదులు కేవలం పువ్వులనే ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆయన్ని 'బేల్పతియా బాబా'గా కొలుస్తున్నారు. ఆకులు, పువ్వులు తింటూనే జీవిస్తున్న ఆయన.. ఇప్పటివరకు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని చెబుతున్నారు. ఆధ్యాత్మికత మార్గాన్ని పాటిస్తున్నందునే ఇలా సాధ్యమైందని అంటున్నారు.