దివ్య సిజ్వాలి, పార్థ్ పూరీ.. ఇద్దరి వయసు పదిహేడేండ్లలోపే. అయితేనేం సొంతంగా ఫుట్ వేర్ కంపెనీ నడుపుతున్నారు వీళ్లు. అమెరికా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకి తమ ప్రొడక్ట్స్ పంపుతున్నారు. ఇంకాస్త ఆశ్చర్యం ఏంటంటే.. పాత టైర్లని రీసైక్లింగ్ చేసి చెప్పులు తయారుచేస్తున్నారు . ఆలోచనే పెట్టుబడిగా పెట్టి సక్సెస్ అయిన ఢిల్లీకి చెందిన ఈ ఫ్రెండ్స్ గురించి..
పాత టైర్లని కాల్చితే.. వాటినుంచి హానికారక కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఒకవేళ చెరువులు, సముద్రాల్లో పడేస్తే మైక్రోప్లాస్టిక్గా మారి నీరు కలుషితం అవుతుంది. అందుకే ‘ టైరాన్’ చెప్పుల బ్రాండ్ని తీసుకొచ్చాం అంటున్నారు ఈ ఫ్రెండ్స్.
ఆ ఆలోచనే...
స్పెషల్ అకేషన్స్కి బోలెడు షూలు, చెప్పులు ఉన్నాయట పార్థ్కి. కానీ, మామూలుగా ఇంట్లో వేసుకోవడానికి మాత్రం ఎప్పుడూ బోరింగ్ డిజైన్లేదొరికేవట. ఇదే విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ దివ్యకి చెప్పాడు పార్థ్. ఆ వెంటనే ఈ సమస్యకి సొల్యూషన్ మనమే ఎందుకు చూపించకూడదు అంది దివ్య. మనలా క్యాజువల్ ఫుట్వేర్లో వెరైటీ కోరుకునే వాళ్లకోసం చెప్పులు తయారు చేద్దామని చెప్పింది. ఆ ఐడియా పార్థ్కి కూడా నచ్చడంతో .. ఇద్దరూ కలిసి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. పరిసరాలకి తమ ప్రొడక్ట్స్ మేలు చేసేవై ఉండాలని టైర్లతో చెప్పుల బేస్ తయారు చేయాలనుకున్నారు. అందుకే తమ కంపెనీ పేరుని కూడా ‘టైరాన్’ అని పెట్టారు. ఆలోచన రాగానే.. దగ్గర్లోని డంప్ యార్డ్స్, పాత సామాన్ల షాపులకి వెళ్లి, టైర్లు కలెక్ట్ చేశారు. వాటిని క్లీన్ చేసి, వైర్లు, స్పైక్స్ తీసేశారు. చెప్పుల తయారీకి పనికొచ్చే పార్ట్స్ని కట్ చేసి, చెప్పులు కుట్టేవాళ్లని వెతుక్కుంటూ వెళ్లారు. వాళ్లు అనుకున్న డిజైన్ని వాళ్లకి వివరంగా చెప్పి, వాళ్ల సలహాల్ని తీసుకొని డిజైన్ని ఫైనల్ చేశారు. వాళ్లకి డిజైనింగ్లో ఇన్పుట్స్ ఇచ్చిన చెప్పులు కుట్టేవాళ్లతోనే టైరాన్ ప్రొడక్ట్స్ కుట్టించి, పోయిన ఏడాది ఏప్రిల్లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. పెట్టుబడి విషయానికొస్తే... వాళ్ల ఐడియాని దేశంలోని వివిధ కాంపిటీషన్స్కి పంపించారు . వాటిలో గెలిచిన డబ్బుతోనే చెప్పుల తయారీకి కావాల్సిన సామాన్లు కొన్నారు. ఆ తర్వాత బల్విన్ కౌర్, గుర్మాన్ సింగ్ సాధు అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్లకి తోడయ్యారు.
సమస్యలొచ్చాయి..
ప్రొడక్ట్స్కి మంచి రీచ్ వస్తుంది.. ఆర్డర్స్ పెరుగుతున్నాయి. కానీ, ఒక పక్క స్కూల్, మరో పక్క బిజినెస్ని బ్యాలెన్స్ చేయలేకపోయారు. అలాగని, రెండింటిలో ఏదో ఒకటే ఎంచుకోలేదు. స్కూల్కి వెళ్తూనే.. రోజుకి మూడు గంటలు బిజినెస్ కోసం కేటాయించారు. ప్రస్తుతం ‘టైరాన్. ఇన్’ వెబ్సైట్ ద్వారానే తమ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు వీళ్లు. ఒక్కో జత చెప్పుల ధర ఆరు వందల నుంచి పన్నెండొందల రూపాయల వరకు ఉంది. మన దగ్గరే కాదు ఇతర దేశాలకు కూడా బల్క్ ఆర్డర్స్ పంపిస్తున్నారు. త్వరలో ఆన్లైన్ సైట్స్లో ఈ చెప్పుల్ని అమ్ముతారట.
అదే మా గోల్
ప్రస్తుతం ఎనిమిది రకాల ఫుట్వేర్ డిజైన్లని అమ్ముతున్నారు వీళ్లు. చాలామంది కస్టమర్స్ మరిన్ని స్టైల్స్లో చెప్పులు కావాలని అడుగుతున్నారట. దాంతో దానిమీద వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు . ఇంకా కొత్త కొత్త మెటీరియల్స్తో చెప్పులు తయారుచేసే ఆలోచనలో ఉన్నారట. ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారని అడిగితే.. ‘‘కంపెనీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నలుగురం కలిసి మాట్లాడుకుంటాం. ఒకరి పనిలో మరొకరం తలదూర్చం. ఎందుకంటే ఎవరికి కేటాయించిన పనిని వాళ్లు వందశాతం ఎఫర్ట్ పెట్టి చేస్తారు. అందుకే ఇబ్బంది అనిపించట్లేదు” అంటోంది దివ్య.