
షాజహానాపూర్ (ఉత్తరప్రదేశ్): ‘కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర తాలిబాన్లు మమ్మల్ని ఆపారు. ఖాళీ ప్రదేశంలో కూర్చోబెట్టారు. వాళ్ల దగ్గర మోడ్రన్ గన్స్ ఉన్నాయి. ఏక్షణాన్నయినా మమ్మల్ని చంపేస్తారనుకున్నాం. ఆ ఓపెన్ ప్లేస్లోనే 5 గంటలు కూర్చున్నాం’ అని కాబూల్ నుంచి ఇండియా వచ్చిన జీత్ బహదూర్ థప చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని చినోరే గ్రామానికి చెందిన 30 ఏళ్ల జీత్ బహదూర్.. అఫ్గానిస్తాన్లోని ఓ కన్సల్టెన్సీ కంపెనీలో రెండున్నరేళ్లుగా సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అఫ్గాన్ నుంచి ఇండియా తిరిగి వచ్చిన వాళ్లలో ఇతనూ ఒకరు. జీత్ పని చేస్తున్న కంపెనీలో ఇండియాకు చెందిన వారు 118 మంది పని చేస్తున్నారు. తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకున్నాక వాళ్లంతా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్ ఎంబసీ వైపు కాలినడకన బయలుదేరారు. అక్కడి నుంచి క్షేమంగా ఇండియా చేరుకోవచ్చని భావించారు.
దొంగలు దోచుకెళ్లారు
మొత్తం 118 మంది ఇండియన్లం అలా నడుస్తూ వస్తుండగా తొలుత కొందరు దొంగలు అడ్డగించారని.. తమ దగ్గరున్న దాదాపు రూ. లక్ష, ఇతర వస్తువులను వాళ్లు లాక్కెళ్లారని జీత్ చెప్పారు. తాము డెన్మార్క్ ఎంబసీ చేరుకోగానే తాలిబాన్ మెంబర్లు ఆపారని.. ‘మీరు హిందువులా?’ అని అడిగారని, తాము ఇండియన్స్ అని చెప్పాక వదిలేశారని వివరించారు. ‘కొందరు మా దగ్గరున్న వస్తువులను, డబ్బులను దొంగిలించారని తాలిబాన్లకు చెప్పాం. అయితే అది తమ పని కాదని, లోకల్ క్రిమినల్స్ చేసుంటారని తాలిబాన్లు చెప్పారు’ అని జీత్ అన్నారు. కాలినడకన చీకటిలో నడుస్తున్న టైమ్లో చాలా మందికి దెబ్బలు తగిలాయని చెప్పారు. ఆగస్టు 18న తాము కాబూల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నామని.. అప్పటికే అక్కడ లక్షలాది మంది ప్రజలు గుమికూడారని అన్నారు. తిండి లేకుండా మూడ్రోజులు అక్కడే ఉన్నామని చెప్పారు. ఇంతలో తాలిబాన్లు వచ్చి తమను ఖాళీ ప్లేస్లో కూర్చోబెట్టారన్నారు. ఆర్మీ ప్లేన్ రాగానే ఆగస్టు 22న తాము ఢిల్లీకి బయలుదేరామని చెప్పారు.
అప్రకటిత కర్ఫ్యూ నడుస్తోంది
అఫ్గానిస్తాన్లో అప్రకటిత కర్ఫ్యూ నడుస్తోందని జీత్ చెప్పారు. ‘అన్ని కంపెనీలు, ఆఫీసులు మూసేశారు. ఒక్కరు కూడా ఇల్లు దాటట్లేదు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు అయితే అస్సలు బయటకు రావట్లేదు’ అన్నారు. మహిళలను తాలిబాన్లు హింసించిన సంఘటనలు తాను చూడలేదని, అయితే వాళ్లు గతంలో చేసిన పనుల వల్ల అక్కడి జనం భయపడుతున్నారని చెప్పారు. ‘అక్కడ తాలిబాన్లు వీధుల్లో ఉంటున్నారు. దీంతో అఫ్గాన్లో భయానక వాతావరణం ఉంది. తామేం చేయమని, అఫ్గాన్లోనే ఉండాలని అక్కడి ప్రజలకు తాలిబాన్లు చాలా సార్లు విన్నవించారని వివరించారు.