18 ఏండ్లుగా మమ్మల్ని పర్మినెంట్ చేయట్లే

18 ఏండ్లుగా మమ్మల్ని పర్మినెంట్ చేయట్లే
  •      సమగ్ర శిక్ష కాంట్రాక్ట్​ ఉద్యోగులు 
  •     అసెంబ్లీ ముట్టడికి యత్నం.. అరెస్ట్

బషీర్ బాగ్, -వెలుగు: తమను పర్మినెంట్​చేయాలని డిమాండ్​చేస్తూ రాష్ట్రంలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బషీర్ బాగ్ లోని సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నేతలు సురేందర్, యాదగిరి, సౌజన్య, దుర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమను పర్మినెంట్​చేయాలని కోరారు. 

అప్పటివరకు మినిమం టైమ్ స్కేల్​అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏండ్లుగా కాంట్రాక్ట్​ఉద్యోగులుగా కొనసాగుతున్నామని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. పాఠశాల విద్య అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని వేడుకున్నారు. జీవిత బీమా కింద రూ.10 లక్షలు , ఆరోగ్య బీమా కింద రూ.5లక్షలు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ లో భాగంగా రూ. 20 లక్షలు చెల్లించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.