
భైంసా, వెలుగు: వృద్ధ దంపతులను నమ్మించి దుండగులు బంగారు చైన్ కొట్టేసిన ఘటన నిర్మల్జిల్లాలో జరిగింది. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గోవింద్, రాజవ్వ దంపతులు మంగళవారం (జూన్ 17) బంధువు ఇంట్లో జరిగే శుభకార్యానికి భైంసాకు వెళ్తూ.. స్థానిక పిప్రి కాలనీ బస్టాండ్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు దంపతులను ఆపారు.
అధికారులమని చెప్పి.. చోరీలు జరుగుతున్నాయని బంగారు చైన్ను మెడలోంచి తీసి సంచిలో దాచుకోవాలని సూచించారు. ముందస్తు ప్లాన్ లో భాగంగా ఒక దుండగుడు తన బంగారు చైన్, రెండు రింగ్ లను తీసి ఇచ్చాడు. వాటిని మిగతా ఇద్దరు పేపర్ పొట్లంలో చుట్టి అతనికి ఇచ్చాడు. వాటిని మరో దుండగుడు తీసుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
ఇది చూసిన వృద్ధ దంపతులు నిజమని నమ్మి వాళ్లు చెప్పినట్టే చేశారు. రాజవ్వ తన బంగారు చైన్ను మెడలోంచి తీసింది. దాన్ని ఓ దుండగుడు పేపర్ లో చుట్టి ఇస్తానని ఆమె నుంచి చైన్తీసుకున్నాడు. మరొకరు దంపతులను మాటల్లో పెట్టగా..ఇంకొకరు ముందుగానే మట్టితో చుట్టిన పేపర్ పొట్లం ఇచ్చి సంచిలో వేసుకోవాలని చెప్పగా.. అలాగే చేసి ముందుకు వెళ్లారు.
ముగ్గురు దుండగులు బైక్ పై పారిపోయారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వృద్ధ దంపతులు పేపర్ పొట్లం విప్పి చూడగా బంగారు చైన్ కు బదులుగా మట్టి ముద్ద, చిన్న కంకర రాళ్లు కనిపించడంతో ఖంగుతిన్నారు. మోసపోయామని రోదిస్తూ బంధువులకు తెలిపారు. సమాచారం అందడంతో టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి వృద్ధ దంపతుల నుంచి వివరాలు సేకరించారు. దుండగుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.