తిమ్మాపూర్, వెలుగు: మండలంలోని సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే మండల సర్వసభ్య సమావేశం నామ్కే వాస్తేగా జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల జనరల్ బాడీ మీటింగ్ స్పెషల్ఆఫీసర్ శ్రీధర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరవగా, వివిధ శాఖల అధికారులతో పాటు సర్పంచులు పాల్గొన్నారు.
అయితే సర్పంచులను అడిగి గ్రామాల్లోని సమస్యలేవీ తెలుసుకోకుండా కేవలం ఆయా శాఖల అధికారులు చదివి వినిపించే అంశాలపై ఎమ్మెల్యే చర్చించి, సమావేశాన్ని ముగించారు. దీంతో తమ గ్రామాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లలేకపోయామని పలువురు సర్పంచులు వాపోయారు. ‘మా సమస్యలు అడగకుండా వారికి వారే చర్చించుకునే మీటింగ్కు మమ్మల్ని ఎందుకు పిలిచారు?’ అంటూ కొందరు నిరాశగా వెనుదిరిగారు.
