- పంపిణీ ప్రారంభించిన తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గంలోని 50 గ్రామపంచాయతీలకు బీబీపేట మండలం జనగామకు చెందిన వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ఫర్నీచర్ అందించారు. ఒక్కో పంచాయతీకి రూ.2 లక్షల విలువైన ఫర్నీచర్ను అందిస్తుండగా, మొదటి విడతలో 50 జీపీలకు గురువారం జనగామలో నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పంచాయతీ ద్వారా మెరుగైన పాలన అందించేందుకు అనువైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఫర్నీచర్ అందిస్తున్నట్లు తెలిపారు.
సర్పంచులు, పాలక వర్గ సభ్యులు కలిసి కట్టుగా గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని కోరారు. తాను చదువుకున్న స్కూల్ బిల్డింగ్ను రూ.7 కోట్లతో నిర్మించటంతో పాటు మరో 2 గ్రామాల్లో స్కూల్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూడడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు తాను ప్రయారిటీ ఇస్తానని చెప్పారు.
తాను స్కూల్ బిల్డింగ్ నిర్మించడంతో తెలంగాణలో అప్పటి ప్రభుత్వం ‘మన ఊరు, మన బడి’, ఏపీలో నాడు, -నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. తాను కష్టపడి ఎదిగానని, తన సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని తెలిపారు.
