ముంబైలో ఇండియా కూటమి కీలక మీటింగ్.. లోగో ఆవిష్కరించే చాన్స్

ముంబైలో ఇండియా కూటమి  కీలక మీటింగ్.. లోగో ఆవిష్కరించే చాన్స్
  • ఇయ్యాల్టి నుంచి రెండ్రోజుల పాటు సమావేశం
  • కన్వీనర్ ను ప్రకటించే అవకాశం 

ముంబై: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటుచేసుకున్న ఇండియా కూటమి మూడో మీటింగ్ గురు,శుక్ర వారాల్లో ముంబైలో జరగనుంది. ఈ కూటమి తొలి సమావేశం పాట్నాలో జరగ్గా, రెండో మీటింగ్ బెంగళూరు​లో జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కీలకమైన మూడో సమావేశంలో అందరూ కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రతిపక్షాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశముంది. 

కూటమి లోగోను ఆవిష్కరించడంతో పాటు కోఆర్డినేషన్ కమిటీని ప్రకటించే చాన్స్ ఉంది. కూటమిని నడిపించేందుకు కోఆర్డినేటర్ లేక చైర్ పర్సన్ ఎంపికపై, సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని తెలిసింది. ఈ మీటింగ్ లో మరిన్ని పార్టీలు కూటమిలో చేరే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి కామన్ అజెండా తయారుచేసేందుకు పలు కమిటీలనూ ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ‘‘ఈ మీటింగ్ లో ‘బీజేపీ చలే జావో’ నినాదమిస్తం. కూటమిలో చాలామంది ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హులు ఉన్నారు” అని కాంగ్రెస్ మహారాష్ట్ర ప్రెసిడెంట్ నానా పటోలే అన్నారు. ఈ సమావేశంలో కూటమి రోడ్ మ్యాప్ ఖరారవుతుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు. కాగా, మీటింగ్​లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు నేతలు ముంబై చేరుకున్నారు. ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూ, ఆయన కొడుకు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు వచ్చారు. 

కన్వీనర్ ఎవరు?  

ఇండియా’ కూటమి కన్వీనర్ రేసులో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి బాధ్యతలు అప్పగించాలని చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. అయితే తాను రేసులో లేనంటూ నితీశ్ ప్రకటించారు. ‘‘నాకు ఎలాంటి వ్యక్తిగత ఆశయాలు లేవు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాలనేదే నా లక్ష్యం” అని ఆయన అన్నారు.